
హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) ప్రెసిడెంట్ పదవి నుంచి తనను తప్పిస్తూ అపెక్స్ కౌన్సిల్ జారీ చేసిన నోటీసులపై భారత మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ ఘాటుగా స్పందించారు. అసోసియేషన్లోని అవినీతిని బయటపెడుతున్నాననే అక్కసుతోనే తనను అడ్డు తొలగించుకుంటున్నారని తెలిపారు. ఉద్దేశపూర్వకంగానే తనకు నోటీసులు ఇచ్చారని,హెచ్సీఏ గౌరవానికి భంగం కలిగేలా తానెప్పుడూ పనిచేయలేదని చెప్పారు.
అపెక్స్ కౌన్సిల్లో తొమ్మిది మంది సభ్యులు ఉంటే వారిలో ఐదుగురు ఓ వర్గంగా ఏర్పడి తాము చేసిందే అపెక్స్ కౌన్సిల్ నిర్ణయంగా భావిస్తే ఎలా? అని ప్రశ్నించారు. హెచ్సీఏలో జరుగుతున్న అవినీతిని అరికట్టడానికి సమర్థమైన వ్యక్తిని అంబుడ్స్మెన్గా నియమిస్తే ఆ ఐదుగురే తప్పుపట్టారన్నారు. వాళ్ల అవినీతి బయటపడుతుందనే అలా చేశారని అజార్ ఆరోపించారు.
'హెచ్సీఏ రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్నారు. అడ్డుకోవాలని చూస్తున్న నాపై బురద చల్లుతున్నారు. అపెక్స్ కౌన్సిల్ సభ్యులు జాన్ మనోజ్, విజయానంద్, నరేశ్ శర్మ, సురేందర్ అగర్వాల్, అనురాధపై అవినీతి ఆరోపణలున్నాయి. వాళ్ల అవినీతికి నేను అడ్డుపడుతున్నందునే నాకు నోటీసులు ఇచ్చి అపెక్స్ కౌన్సిల్ జారీ చేసినట్లుగా చెబుతున్నారు'' అని అజారుద్దీన్ మీడియాకు వెల్లగించారు.
ఇక జస్టిస్ లోధా సిఫార్సుల మేరకే అజారుద్దీన్పై నోటీసులు జారీచేశామని అపెక్స్ కౌన్సిల్ తెలిపింది. కౌన్సిల్లోని ఆరుగురిలో ఐదుగురు సభ్యులు ఆ నిర్ణయం తీసుకున్నారని వివరించింది. వారిని ఓ బృందంగా పోల్చడం సరికాదని వెల్లడించింది. నిజానికి ఆ ఐదుగురే అపెక్స్ కౌన్సిలని, అది ఎన్నికైందని పేర్కొంది.
వాస్తవంగా కౌన్సిల్లో తొమ్మిది మంది ఉంటారని ఒకరు అధ్యక్షుడైన అజారుద్దీన్ కాగా, పురుషుల జట్టు నుంచి ఇద్దరు, మహిళల జట్టు నుంచి ఒకరు ఉంటారంది. ఆ మిగిలిన ఐదుగురే నిజమైన అపెక్స్ కౌన్సిలని, వారే నిర్ణయం తీసుకున్నారని వెల్లడించింది. ఈ రోజు నుంచి అజారుద్దీన్ అధ్యక్షుడు కాడని, ఇందులో బీసీసీఐ జోక్యం ఉండదని స్పష్టం చేసింది. హెచ్సీఏ సమావేశాలకు అజార్ అధ్యక్షుడిగా కాకుండా ఒక వ్యక్తిగా వస్తారని తెలిపింది.