జూబ్లీహిల్స్ ఉప్ప ఎన్నికలో అధికార కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ 25 వేల పైచిలుకు ఓట్ల మెజార్జీతో గెలుపొందారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి ఈ ఫలితం ఉంది. హోరాహోరీ పోటీ ఉంటుందని జోరుగా ప్రచారం సాగింది. కానీ కాంగ్రెస్ అనూహ్యంగా భారీ మెజార్టీ సాధించింది. వాస్తవానికి పొలింగ్కు ముందు మెజార్టీ సర్వే సంస్థలు బీఆర్ఎస్దే విజయమని చెప్పాయి. కానీ వ్యూహాత్మక అడుగులు వేసిన కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన పోల్ మేనేజ్మెంట్తో భారీ విజయాన్ని కైవసం చేసుకుంది. తమ రెండేళ్ల పాలనను మెచ్చి ప్రజలు ఇచ్చిన తీర్పు అని కాంగ్రెస్ పార్టీ సంతోషం వ్యక్తం చేస్తుంది.
అయితే ఈ విజయంలో టీమిండియా మాజీ కెప్టెన్, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్ కీలక పాత్ర పోషించారు. సరిగ్గా పోలింగ్కు కొద్ది రోజుల ముందు ఆయనకు మంత్రి పదవి ఇవ్వడం కాంగ్రెస్కు బాగా కలిసొచ్చింది. ముఖ్యంగా ముస్లిం ఓట్లు ఎక్కువగా ఉండే ఈ నియోజకవర్గంలో వారిని ఆకర్షించేందుకు అజారుద్దీన్కు మంత్రి పదవి ఇస్తూ కాంగ్రెస్ పన్నిన వ్యూహం బాగా పనిచేసింది.

2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన అజారుద్దీన్కు 64,212 ఓట్లు వచ్చాయి. కానీ బీఆర్ఎస్ తరఫున దివంగత మాగంటి గోపీనాథ్ 80,550 ఓట్లతో విజయం సాధించారు. తాజా ఉప ఎన్నికలో అజారుద్దీన్కు టికెట్ ఇవ్వకుండా బీసీ అభ్యర్థి అయిన నవీన్ యాదవ్కు కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. ఈ నిర్ణయం అజారుద్దీన్ను నిరాశకు గురి చేసింది. మరోవైపు ముస్లిం వర్గంలో కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తి ఉందనే విషయాన్ని పసిగట్టిన సీఎం రేవంత్ రెడ్డి.. అజారుద్దీన్కు మంత్రి పదవి ఇస్తూ వేసిన ఎత్తుగడ మంచి ఫలితాన్ని ఇచ్చింది.
ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నట్లు అటు అజారుద్దీన్తో పాటు ముస్లిం వర్గాన్ని రేవంత్ తవమైపు తిప్పుకున్నారు. అలక వహించిన అజారుద్దీన్ మంత్రి పదవితో మరింత హుషారుగా పనిచేశారు. రేవంత్ రెడ్డి కూడా తన ప్రచారంలో పదే పదే అజారుద్దీన్కు మంత్రి పదవి ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. టీమిండియా మాజీ క్రికెటర్గా అతను ఎంతో సేవ చేశాడని కొనియాడారు. ప్రపంచకప్ గెలిచిన ఆటగాడని(వాస్తవానికి అజార్ ప్రపంచకప్ గెలువలేదు) కూడా చెప్పారు. అజారుద్దీన్కు మంత్రి పదవి ఇవ్వడం ఈ ఎన్నికకు గేమ్ ఛేంజర్గా మారింది. అంతేకాకుండా ఎంఐఎం మద్దతు, అధికారంలో ఉండటం కూడా కాంగ్రెస్ విజయానికి బాటలు వేసాయి.
1983-99 మధ్య భారత్ తరఫున 99 టెస్ట్ మ్యాచ్లు, 334 వన్డేలు ఆడిన మహమ్మద్ అజారుద్దీన్.. రెండు ఫార్మాట్లలో కలిపి 15593 పరుగులు చేశాడు. ఇందులో 29 సెంచరీలు..79 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మహమ్మద్ అజారుద్దీన్ సారథ్యంలోనే భారత జట్టు 1996 వన్డే ప్రపంచకప్లో సెమీఫైనల్లో ఓడి టైటిల్ చేజార్చుకుంది.