పాకిస్థాన్ మాజీ పేసర్ మహమ్మద్ అమీర్ మరోసారి భారత్పై తన అక్కసును వెళ్లగక్కాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో ఎట్టి పరిస్థితుల్లో భారత్ సెమీఫైనల్ చేరదని జోస్యం చెప్పాడు. పాకిస్థాన్ సెమీ ఫైనల్ చేరినా.. చేరకున్నా భారత్కు మాత్రం సెమీ ఫైనల్ బెర్త్ దక్కదన్నాడు.
జింబాబ్వేతో సూపర్-8 మ్యాచ్లో 72 పరుగుల భారీ తేడాతో గెలిచిన భారత్.. వెస్టిండీస్తో ఆదివారం డూ ఆర్ డై మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే భారత్ సెమీస్ చేరనుంది. వర్షంతో రద్దయినా.. ఓటమిపాలైనా టోర్నీ నుంచి నిష్క్రమించనుంది. కోల్కతా వేదికగా జరిగే ఈ మ్యాచ్లో టీమిండియా గెలిచి సెమీస్ చేరుతుందని భారత అభిమానులు భావిస్తున్నారు. కానీ అమీర్ మాత్రం భారత్ సెమీ ఫైనల్ చేరదని, వెస్టిండీస్పై విజయం సాధించలేదని జోస్యం చెప్పాడు.
సూపర్-8 దశకు ముందే మహమ్మద్ అమీర్ ఈ విషయాన్ని వెల్లడించాడు. గ్రూప్-1లో భారత్ కంటే సౌతాఫ్రికా, వెస్టిండీస్ మెరుగైన ప్రదర్శన చేస్తున్నాయని, ఆ జట్లను టీమిండియా ఓడించలేదని తెలిపాడు. అమీర్ చెప్పినట్లుగానే అహ్మదాబాద్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో భారత్ 76 పరుగుల తేడాతో చిత్తయ్యింది. దాంతో అమీర్ను పాకిస్థాన్ టీవీ యాంకర్ ఆస్ట్రాలజర్ అని ప్రశంసల జల్లు కురిపించింది.

ఆ మాటలకు అతను నవ్వు ఆపుకోలేకపోయాడు. మరోసారి అంచనా వేయాలని కోరగా..'పాకిస్థాన్ సెమీస్ చేరుతుంది. పాక్ సెమీస్ చేరినా.. చేరకున్నా ఒరిగేది ఏం లేదు. కానీ భారత్ మాత్రం సెమీస్కు అర్హత సాధించదు.'అని స్పష్టం చేశాడు. మెగా టోర్నీ ప్రారంభ సమయంలోనూ అమీర్ ఈ తరహా వ్యాఖ్యలు చేశాడు. అభిషేక్ శర్మ ఓ స్లాగర్ అని, అతని బ్యాటింగ్లో టెక్నిక్ లేదని విమర్శలు గుప్పించాడు.
మరోవైపు పాకిస్థాన్ కూడా డూ ఆర్ డై మ్యాచ్కు సిద్దమైంది. శ్రీలంకతో మరికాసేపట్లో ప్రారంభమయ్యే మ్యాచ్లో పాకిస్థాన్ 65 పరుగుల తేడాతో విజయం సాధించాలి. లేదంటే శ్రీలంక విధించిన లక్ష్యాన్ని 13 ఓవర్లలో ఛేదించాలి. అప్పుడే న్యూజిలాండ్ కంటే మెరుగైన రన్రేట్తో సెమీస్ బెర్త్ దక్కుతుంది. ఇలా కాకుండా విజయం సాధించినా టోర్నీలో ముందడుగు వేయదు. ఇంగ్లండ్, సౌతాఫ్రికా సెమీస్ బెర్త్ దక్కించుకోగా.. మరో రెండు స్థానాల కోసం భారత్, వెస్టిండీస్, పాకిస్థాన్, న్యూజిలాండ్ పోటీ పడుతున్నాయి.