
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై విమర్శలు గుప్పించిన క్రిటిక్స్పై పాకిస్థాన్ మాజీ ప్లేయర్ మహమ్మద్ అమీర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అసలు కోహ్లీని ఎందుకు విమర్శిస్తారో తనకు అర్థం కాదన్నాడు. విమర్శించిన ప్రతీసారి కోహ్లీ బ్యాట్తోనూ సమాధానమిచ్చాడని తెలిపాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన ఆఖరి టెస్ట్లో సెంచరీ బాదిన కోహ్లీ.. మూడేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించాడు. సుమారు 6 సెషన్ల పాటు బ్యాటింగ్ చేసిన కోహ్లీ 186 పరుగులు చేసి భారత్కు భారీ స్కోర్ అందించాడు. దాంతో ఈ మ్యాచ్ డ్రా కాగా.. టీమిండియా 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది.
తాజాగా హిందూస్తాన్ టైమ్స్తో మాట్లాడిన మహమ్మద్ అమీర్.. కోహ్లీ విమర్శకులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. 'విరాట్ కోహ్లీని విమర్శించే వారు ఎందుకు విమర్శిస్తారో అర్థం కాదు. అతను కూడా ఓ మనిషే. రిమోట్ నొక్కగానే ఆడి ప్రతీ రోజు సెంచరీ చేయడానికి అతను ఏం యంత్రం కాదు. ప్రతీ ఆటగాడికి కెరీర్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. నేను కూడా ఇలాంటి విషమ దశను ఎదుర్కొన్నాను.
నేను అద్భుతంగా బౌలింగ్ చేసినా వికెట్లు వచ్చేవి కావు. కానీ కొన్ని సార్లు మాత్రం చెత్తగా బౌలింగ్ చేసినా.. ఫుల్ టాస్లు వేసినా వికెట్లు దక్కేవి. క్రికెట్లో ఎంత గొప్పగా రాణించినా లక్ కూడా కలిసి రావాలి. ఇక విరాట్ కోహ్లీ హార్డ్ వర్క్పై ఎలాంటి సందేహం అక్కర్లేదు. సవాళ్లను అతను ఇష్టపడుతాడు. విమర్శించిన ప్రతీసారి అతను బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఆటతోనే విమర్శకుల నోళ్లు మూయించాడు.'అని మహమ్మద్ అమీర్ తెలిపాడు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని గెలిచిన టీమిండియా మూడు వన్డేల సిరీస్ కోసం సిద్దమవుతోంది. మార్చి 17న ముంబై వేదికగా తొలి వన్డే జరగనుండగా.. భారత జట్టు మంగళవారం అక్కడికి చేరుకుంది. బుధవారం నుంచి ప్రాక్టీస్ మొదలుపెట్టనుంది. వెన్ను గాయంతో శ్రేయస్ అయ్యర్ దూరం కాగా.. బీసీసీఐ ఎవరిని రిప్లేస్మెంట్గా ప్రకటించలేదు. ఈ సిరీస్ అనంతరం మార్చి 31 నుంచి ఐపీఎల్ 2023 ప్రారంభం కానుండగా.. జూన్ 7 నుంచి ఇంగ్లండ్ వేదికగా ఆసీస్ డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడనుంది.