పాకిస్థాన్ మాజీ పేసర్ మహమ్మద్ అమీర్ మరోసారి భారత్పై తన అక్కసును వెళ్లగక్కాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో టీమిండియా అసాధారణ ప్రదర్శనతో సెమీఫైనల్ చేరడాన్ని జీర్ణించుకోలేకపోతున్న అమీర్ సంచలన ఆరోపణలు చేశాడు. టీమిండియా తొండాటతో వెస్టిండీస్పై విజయం సాధించిందని ఆరోపించాడు. వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్ హెట్మైర్ ఔటవ్వకున్నా అంపైర్లు ఔటిచ్చారని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం అతని వ్యాఖ్యలు నెట్టింట తీవ్ర దుమారం రేపుతున్నాయి.
మెగా టోర్నీ ప్రారంభమైనప్పటి నుంచే అమీర్.. భారత్కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. అభిషేక్ శర్మ గాలిగాడని, గుడ్డిగా బ్యాట్ ఊపుతాడని, అతని బ్యాటింగ్లో టెక్నిక్ లేదని విమర్శలు గుప్పించాడు. ఆ తర్వాత భారత్ ఎట్టి పరిస్థితుల్లో సెమీఫైనల్ చేరలేదని, సౌతాఫ్రికా, వెస్టిండీస్ టీమిండియా కంటే బలంగా ఉన్నాయని జోస్యం చెప్పాడు. సౌతాఫ్రికాతో భారత్ ఓటమి పాలవ్వగానే.. తన జోస్యం నిజమైందని శునకానందం పొందాడు. విండీస్ చేతిలో కూడా ఓడిపోతుందని బల్లగుద్ది చెప్పాడు.

ఆదివారం కోల్కతా వేదికగా జరిగిన డూఆర్డై పోరులో సంజూ శాంసన్ (50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్స్లతో 97 నాటౌట్) అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శనతో టీమిండియా 5 వికెట్ల తేడాతో గెలుపొంది సెమీఫైనల్కు దూసుకెళ్లింది. అయితే ఈ మ్యాచ్లో బుమ్రా బౌలింగ్లో డెంజరస్ హెట్మైర్ కీపర్ క్యాచ్గా వెనుదిరిగాడు.
అతని బ్యాట్, జెర్సీని తాకుతూ బంతి కీపర్ చేతిలో పడింది. బ్యాట్ తాకలేదని భావించిన హెట్మైర్ థర్డ్ అంపైర్ సమీక్ష కోరాడు. అల్ట్రా ఎడ్జ్లో బంతి బ్యాట్ను తాకినట్లుగా స్పైక్ కనిపించింది. దాంతో హెట్మైర్ పెవిలియన్ చేరాడు. ఆ సమయంలో ఈ నిర్ణయం పట్ల హెట్మైర్, విండీస్ కోచ్ డారెన్ సామీ అసంతృప్తి వ్యక్తం చేశారు.

భారత్ విజయంతో తన జోస్యం మిస్ఫైర్ కావడంతో ముఖం చూపించుకోలేకపోయిన అమీర్.. టీమిండియా తొండాట ఆడిందని కొత్త రాగం ఎత్తుకున్నాడు. 'వివాదాస్పద రీతిలో హెట్మైర్ ఔటయ్యాడని నేను భావిస్తున్నా. అతను ఔటయ్యాడని నేను అనుకోవడం లేదు. ఒకవేళ అతనే గనుక ఇంకాసేపు క్రీజులో ఉండి ఉంటే వెస్టిండీస్ 220-230 పరుగులు చేసేది. అప్పుడు భారత్ ఈ రోజే టోర్నీ నుంచి నిష్క్రమించి ఉండేది.
భారత్ సెమీస్ చేరినా.. ప్రపంచకప్ గెలవలేదు. సెమీస్ చేరిన జట్లు భారత్ కంటే బలంగా ఉన్నాయి. వారి వద్ద మెరుగైన స్పిన్నర్లు ఉన్నారు. స్వచ్ఛమైన క్రికెట్ కోణం నుంచి చూస్తే భారత్ అంత బాగా ఆడటం లేదు. ఇది నా బలమైన నమ్మకం. వారి ఫీల్డింగ్ నాసిరకంగా ఉంది. మూడు, నాలుగు క్యాచ్లు వదిలేశారు. బుమ్రా మినహా ప్రతి బౌలర్ను ప్రత్యర్థి బ్యాటర్లు బాదుతున్నారు.
క్రికెట్ తెలిసిన భారత అభిమానులు నా మాటలతో ఏకీభవిస్తారు. హార్దిక్ పాండ్యా... పెద్ద జట్లపై బాగా ఆడడని నేను ముందే చెప్పాను. వరుణ్ చక్రవర్తి కూడా ధారాళంగా పరుగులు ఇచ్చాడు. వెస్టిండీస్ జట్టు కంటే మెరుగైన స్పిన్నర్లను భారత్ ఇకపై ఎదుర్కోవాల్సి ఉంది. ఇప్పటికీ ఈ టోర్నమెంట్లో భారత్ హాట్ ఫేవరెట్ అని నేను నమ్మడం లేదు.'అని మహమ్మద్ అమీర్ అభిప్రాయపడ్డాడు.
