న్యూయార్క్: చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీకి చెందిన మరో జట్టుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) సారథి ఫాఫ్ డుప్లెసిస్ నాయకత్వం వహించబోతున్నాడు. అగ్రరాజ్యం అమెరికా వేదికగా వచ్చె నెలలో జరగనున్న మేజర్ లీగ్ క్రికెట్(ఎంఎల్సీ)లో టెక్సాస్ సూపర్ కింగ్స్ జట్టును ఫాఫ్ డుప్లెసిస్ నడిపించనున్నాడు.
ఇప్పటికే సౌతాఫ్రికా టీ20 లీగ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీకి చెందిన జోహన్నస్ బర్గ్ సూపర్ కింగ్స్ టీమ్కు కెప్టెన్గా వ్యవహరిస్తున్న ఫాఫ్ డుప్లెసిస్.. తాజాగా టెక్సాస్ సూపర్ కింగ్స్ సారథ్య బాధ్యతలను స్వీకరించాడు. ఈ విషయాన్ని టెక్సాస్ సూపర్ కింగ్స్ ట్విటర్ వేదికగా వెళ్లడించింది.
అగ్రరాజ్యంలో జరిగే ఈ మినీ ఐపీఎల్కు జూలై 13న తెరలేవనుంది.

17 రోజుల పాటు జరగనున్న ఈ లీగ్లో చెన్నై, కోల్కతా, ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీలకు చెందిన టెక్సాస్ సూపర్ కింగ్స్, లాస్ ఏంజిల్స్ సూపర్ నైట్రైడర్స్, సియాటెల్ క్యాపిటల్స్, ఏంఐ న్యూయార్క్, తలపడనున్నాయి. ఢిల్లీకి చెందిన సియాటెల్ టీమ్లో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదేళ్ల కో ఓనర్గా ఉన్నాడు.
ఈ ఐదు జట్లే గాక వాషింగ్టన్ డీసీ ఫ్రాంచైజీని భారత సంతతికి చెందిన సంజయ్ గోవిల్ కొనుగోలు చేశాడు సాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ జట్టును ఆనంద్ రామరాజన్ అనే భారత సంతతి వ్యాపారి కొనుగోలు చేశాడు. మొత్తం ఆరు జట్ల మధ్య జరిగే ఈ లీగ్.. జూలై 30న ముగియనుంది. టెక్సాస్ సూపర్ కింగ్స్ తరఫున తెలుగు తేజం అంబటి రాయుడు కూడా బరిలోకి దిగనున్నాడు.
జూలై 13న జరిగే ఈ లీగ్ తొలి మ్యాచ్లో టెక్సాస్ సూపర్ కింగ్స్, లాస్ ఏంజెల్స్ నైట్రైడర్స్ జట్లు తలపడనున్నాయి. జూలైన 14న ఎంఐ న్యూయార్క్-సాన్ఫ్రాన్సిస్కో యూనికార్న్స్తో పాటు అదే జోరు సియాటెల్ ఆర్కర్స్, వాషింగ్టన్ ఫ్రీడమ్ టీమ్స్ తలపడనున్నాయి.
ఈ మేజర్ క్రికెట్ లీగ్లో అంతర్జాతీయ క్రికెటర్లు జాసన్ రాయ్, మార్కస్ స్టోయినీస్, ఆరోన్ ఫించ్, క్వింటన్ డికాక్, మిచెల్ మార్ష్, అన్రిచ్ నోర్జ్, వానిందు హసరంగాలు బరిలోకి దిగనున్నారు.