హైదరాబాద్: అగ్రరాజ్యం అమెరికా వేదికగా మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీ(ఎంఎల్సీ) రసవత్తరంగా సాగుతోంది. ఈ ధనాధన్ లీగ్కు అమెరికా ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఈ టోర్నీలో ఐపీఎల్ ఫ్రాంచైజీలు భాగస్వామ్యం కావడంతో ఈ టోర్నీ మినీ ఐపీఎల్ను తలపిస్తోంది. అయితే అక్కడ కూడా చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ అభిమానుల సందడే ఎక్కువగా ఉంది.
చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ టెక్సాస్ సూపర్ కింగ్స్తో బరిలోకి దిగగా.. ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ఎంఐ న్యూయార్క్ టీమ్తో ఆడుతోంది. మంగళవారం డల్లాస్ వేదికగా ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్కు భారీ సంఖ్యలో ప్రేక్షకులు హాజరయ్యారు. టోర్నీ ప్రారంభమైనప్పటి నుంచి ఇంత పెద్ద ఎత్తున ఫ్యాన్స్ రావడం ఇదే తొలిసారని లీగ్ వర్గాలు పేర్కొన్నాయి.

మేజర్ లీగ్ క్రికెట్ అధికారిక ట్విటర్లో ఇందుకు సంబంధించిన ఫొటోను షేర్ చేశాయి. ఈ లీగ్ను ఎక్కువగా భారత సంతతి పౌరులే చూస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన అభిమానులు హాజరవుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి.
అగ్రరాజ్యంలోనూ ముంబై, చెన్నై అభిమానులదే సందడని ఆ ఫ్రాంచైజీల ఫ్యాన్స్ గర్వంగా చెప్పుకుంటున్నారు. ఈ మ్యాచ్లో టెక్సాస్ సూపర్ కింగ్స్ 17 పరుగులతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టెక్సాస్ సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 154 పరుగులు చేసింది.
డేవాన్ కాన్వే(55 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్తో 74) హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. మిచెల్ సాంట్నర్(27) మెరుపులు మెరిపించాడు. ఎంఐ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, కగిసో రబడా రెండేసి వికెట్లు తీయగా.. కీరన్ పొలార్డ్, రషీద్ ఖాన్ తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఎంఐ న్యూయార్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 137 పరుగులే చేసి ఓటమిపాలైంది. ఓపెనర్ షయన్ జహంగీర్(41), టీమ్ డేవిడ్(24) మినహా అంతా విఫలమయ్యారు. టెక్సాస్ బౌలర్లలో డానియల్స్ సామ్స్, మహమ్మద్ మోహ్సిన్ రెండేసి వికెట్లు తీయగా.. రస్టీ థేరన్, జియా ఉల్ హక్, డ్వేన్ బ్రావో తలో వికెట్ తీసారు.