
న్యూఢిల్లీ: టాస్ గెలవటం ఎలాగో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నుంచి నేర్చుకోవాలనుకుంటున్నానని భారత మహిళల జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ తెలిపింది. ఆస్ట్రేలియా పర్యటనలో ఆతిథ్య జట్టుతో ఏకైక డే/నైట్ టెస్ట్ను మిథాలీ సేన డ్రా చేసుకుంది. వర్షం కారణంగా తొలి రెండు రోజుల్లో కలిపి 80 ఓవర్లకు పైగా ఆట సాధ్యపడలేదు. దాంతో మ్యాచ్ ఫలితం తేలకుండానే ముగిసింది. అయితే ఈ మ్యాచ్లో మిథాలీ రాజ్ టాస్ ఓడటంతో ముందుగా బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. కెప్టెన్గా మంచి రికార్డులున్న మిథాలీ టాస్ విషయంలో మాత్రం తడబడుతూనే ఉంది. ఇంగ్లండ్ పర్యటనలోను టాస్ ఓడిపోయింది. దాన్నే ఆసీస్ పర్యటనలో కొనసాగించింది.
దాంతో ఈ విజయానంతరం మీడియాతో మాట్లాడిన మిథాలీ రాజ్ ముందు ఓ మీడియా ప్రతినిధి టాస్ విషయం ప్రస్తావించగా ఆమె తనదైన శైలిలో సరదాగా బదులిచ్చింది. పింక్ బాల్ టెస్టులో టాస్ ఓడినప్పటికీ తమ ప్లేయర్ల సహకారంతో ఆసీస్పై పైచేయి సాధించామని పేర్కొంది. టాస్ తరచుగా కలిసిరాకపోయినా టీమ్ సభ్యులు సహకరిస్తున్నారని తెలిపింది. " ఇక నుంచి ఇలా తరచుగా టాస్ ఓడటాన్ని రిపీట్ చేయకూడదనుకుంటున్నా. అయినా.. జట్టు సభ్యులు నాకు మద్దతునిస్తున్నారు. టాస్ ఓడినా అద్భుతంగా రాణిస్తూ టీమ్ను విజయం వైపు నడిపిస్తున్నారు. బహుశా.. నేనే మారాలనుకుంటా. టాస్ ఎలా గెలవాలో మహేంద్ర సింగ్ ధోనీ నుంచి నేర్చుకోవాలనుకుంటున్నా.'అని మిథాలీ చెప్పుకొచ్చింది.
ఈ మ్యాచ్లో భారత్ ఆసాంతం ఆధిపత్యం చెలాయించడం పట్ల మిథాలీ రాజ్ సంతోషం వ్యక్తం చేసింది. ఈ ప్రదర్శన ఎంతో ప్రత్యేకమైనదని చెప్పుకొచ్చింది. అయితే 2014లో ఇంగ్లండ్ గడ్డపై సాధించిన టెస్ట్ విజయం మాత్రం మరిచిపోలేనిదని పేర్కొంది. 'అత్యుత్తమ జట్లపై అద్భుత ప్రదర్శన కనబర్చడం ఎప్పటికీ ప్రత్యేకంగా ఉంటుంది. ఆస్ట్రేలియా మేం ఆడిన ఈ పింక్ టెస్ట్ కూడా అద్భుతమైనదే. కానీ 2014లో 8 మంది అరంగేట్ర ప్లేయర్లతో అప్పుడే యాషెస్ సిరీస్ గెలిచి వచ్చిన ఇంగ్లండ్ను ఓడించడం మాత్రం ప్రత్యేకం. అది కూడా చాలా రసవత్తరంగా జరిగిన మ్యాచ్. అమ్మాయిలు అద్భుతంగా రాణించారు.'అని మిథాలీ చెప్పుకొచ్చింది.
భారత్-ఆస్ట్రేలియా మహిళల మధ్య 15 ఏళ్ల తర్వాత జరిగిన తొలి టెస్ట్, ఏకైక డే/నైట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఓవర్నైట్ స్కోరు 143/4తో ఆఖరి, నాలుగో రోజైన ఆదివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆసీస్ మరో 98 రన్స్ జోడించి 241/9 వద్ద డిక్లేర్ చేసింది. ఎలిస్ పెర్రీ (68 నాటౌట్), యాష్లే గార్డ్నర్ (51) అర్ధ సెంచరీలు సాధించారు. పూజా వస్ర్తాకర్ 3 వికెట్లు పడగొట్టగా.. జులన్ గోస్వామి, మేఘా సింగ్, దీప్తీ శర్మ తలో రెండేసి వికెట్లు తీశారు.
అనంతరం వేగంగా ఆడిన టీమిండియా టీ విరామం తర్వాత రెండో ఇన్నింగ్స్ను 135/3 వద్ద డిక్లేర్ చేసింది. షెఫాలీ వర్మ (52) అర్ధ సెంచరీతో పాటు పూనమ్ రౌత్ (41 నాటౌట్), స్మృతి మంధాన (31) రాణించారు. ఇక చివరి సెషన్లో కంగారూలు 32 ఓవర్లలో 272 పరుగుల భారీ లక్ష్య ఛేదనతో బరిలోకి దిగారు. అయితే ఆసీస్ 15 ఓవర్లలో 36/2 స్కోరు వద్ద ఇరు జట్ల కెప్టెన్లు డ్రాకు అంగీకరించారు. ఓపెనర్ల వికెట్లను భారత్ త్వరగానే తీసినప్పటికీ లానింగ్ (17 నాటౌట్) క్రీజులో పాతుకుపోవడంతో డ్రా తప్పలేదు. స్మృతి మంధాన 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్'గా నిలిచింది.