మహిళల వన్డే ప్రపంచకప్ 2005 ఫైనల్ ఆడితే తమకు మ్యాచ్కు రూ. 1000 చొప్పున ఇచ్చారని టీమిండియా మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ తెలిపింది. ఆ టోర్నీలో 8 మ్యాచ్లు ఆడితే ఒక్కో ప్లేయర్కు రూ.8000 వచ్చాయని పేర్కొంది. గతంలో ఓ టీవీ షోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మిథాలీ రాజ్ ఈ విషయాన్ని వెల్లడించింది. మహిళల క్రికెట్ దయనీయ స్థితి గురించి వివరించింది. అప్పట్లో మ్యాచ్ ఫీజులు, జీతాలు మహిళల క్రికెటర్లకు లేవని స్పష్టం చేసింది.
తాజాగా భారత మహిళల జట్టు విశ్వ విజేతగా నిలవడంతో మిథాలీ రాజ్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి. ఆదివారం జరిగిన ఫైనల్లో హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు 52 పరుగుల తేడాతో సౌతాఫ్రికాను ఓడించింది. ఈ విజయంతో 47 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. తొలి ప్రపంచకప్ను ముద్దాడింది. ఈ గెలుపు నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) హర్మన్ సేనకు రూ. 51 కోట్ల భారీ నజరానా ప్రకటించింది.

ఈ క్రమంలోనే మిథాలీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. మహిళల క్రికెట్ ఎక్కడి నుంచి ఏ స్థితికి ఎదిగిందో చూడండని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అప్పట్లో భారత మహిళల క్రికెట్ బీసీసీఐ పరిధిలో లేదు. దాంతో మ్యాచ్లు ఆడేందుకు స్పాన్సర్ల కోసం నిరీక్షించేది. విరాళల సాయంతో మ్యాచ్లు ఆడేది. కనీస వసతులు కూడా మహిళల జట్టుకు ఉండేవి కావు.
భారత మహిళా క్రికెట్ అసోసియేషన్.. భారత మహిళల క్రికెట్ను పర్యవేక్షించేది. దేశవాళీ మ్యాచ్లు, అంతర్జాతీయ ద్వైపాక్షిక సిరీస్లు కూడా అంతగా ఉండేవి కాదు. ఇక 2006లో భారత మహిళల క్రికెట్ బీసీసీఐలోకి అధికారికంగా వీలినమైంది. బీసీసీఐలోకి వీలినమైనా.. మహిళా క్రికెటర్ల పట్ల చిన్నచూపు ఉండేది. బోర్డు సభ్యులు పెద్దగా పట్టించుకోకపోయేవారు. మహిళల మ్యాచ్లు ప్రత్యక్ష ప్రసారం కూడా చేసేవారు కాదు.
మహిళల వన్డే ప్రపంచకప్ 2017 ఫైనల్లో ఓడినా.. భారత జట్టు చూపిన అసాధారణ ప్రదర్శనతో బీసీసీఐ తమ ఆలోచనను మార్చుకుంది. గంగూలీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మహిళా క్రికెట్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాడు. మహిళల దేశవాళీ క్రికెట్ను పటిష్టం చేయడంతో పాటు సమాన వేతనాలు ఇవ్వడం ప్రారంభించాడు. ఐపీఎల్ మధ్యలో ఛాలెంజర్స్ టోర్నీని నిర్వహించాడు.
బీసీసీఐ సెక్రటరీగా జైషా.. మహిళల క్రికెట్ను మరో స్థాయికి తీసుకెళ్లాడు. పురుషుల క్రికెట్ తరహాలోనే అన్ని వసతులు కల్పించాడు. ఐపీఎల్ తరహాలోనే డబ్ల్యూపీఎల్ నిర్వహించడం ప్రారంభించారు. ఈ టోర్నీలో మహిళా క్రికెటర్ల రాతే మారిపోయింది. మహిళా క్రికెటర్లకు కూడా కోట్ల రూపాయాల డబ్బు లభించింది.
ప్రస్తుతం మహిళా క్రికెటర్లకు మ్యాచ్ ఫీజులుగా పురుషుల తరహాలోనే సమాన వేతనాలు అందుతున్నారు. టెస్ట్ మ్యాచ్ ఫీజుగా రూ.15 లక్షలు, వన్డే మ్యాచ్ ఫీజుగా రూ. 6 లక్షలు, టీ20 మ్యాచ్ ఫీజుగా రూ. 3 లక్షలు అందుతున్నాయి. మ్యాచ్ ఫీజులో సమాన వేతనాలే ఉన్నప్పటికీ కాంట్రాక్టుల్లో మాత్రం తేడా ఉంది. పురుషుల క్రికెటర్లకు A+, A, B, C అనే నాలుగు గ్రేడ్లు ఉండగా.. A+ ఆటగాళ్లకు రూ. 7 కోట్ల వార్షిక వేతనం అందుతుంది. కానీ మహిళల కాంట్రాక్టులు A, B, C అనే మూడు గ్రేడ్లలోనే ఉండగా.. Aగ్రేడ్ ఆటగాళ్లకు రూ. 50 లక్షల వార్షిక వేతనం అందుతుంది.
2005లో 8 మ్యాచ్లు ఆడిన మిథాలీ సేనకు కేవలం రూ. 8 వేలు మ్యాచ్ ఫీజుగా లభిస్తే.. తాజా టోర్నీలో హర్మన్ సేనకు రూ. 54 లక్షలు మ్యాచ్ ఫీజుగా వచ్చింది. అలవెన్సులు, బీసీసీఐ నజరానా, ఐసీసీ క్యాష్ ప్రైజ్ అదనం. 1983 ప్రపంచకప్ విజయం దేశంలో క్రికెట్ను మతంలా మారిస్తే.. 2025 ప్రపంచకప్ విజయం మహిళల క్రికెట్ గతిని మార్చనుంది. పురుషుల తరహాలోనే మహిళా క్రికెటర్లు కోట్లు ఆర్జించనున్నారు.