
మరో ప్రపంచకప్ ఆడే ఆస్కారం లేకపోవడంతో..
'ఇది హఠాత్తుగా తీసుకున్న నిర్ణయమేం కాదు. చాలా ముందే అనుకున్నాను. వన్డే ప్రపంచకప్లో నిరాశ ఎదురైంది. దాని నుంచి బయటపడేందుకు కాస్త సమయం పట్టింది. ప్రపంచకప్ సాధించాలని కలగన్నాను. ఇంకో ప్రపంచకప్ ఆడే పరిస్థితి లేదు. అలాంటప్పుడు క్రికెట్లో కొనసాగడంలో అర్థం లేదు. ఇంతకాలం ఏ లక్ష్యంతో ఆడానో దాన్ని అందుకోలేకపోయాను. అందుకే ఇంకొంతకాలం ఆడే సత్తా ఉన్నప్పటికీ వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నాను.

ఆ ఒక్కటి తప్పా..
ఇన్నేళ్ల కెరీర్లో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నా. మహిళల క్రికెట్లో ఎన్నో మార్పులను ప్రత్యక్షంగా చూశాను. ఎన్నో మధుర విజయాలనూ అందుకున్నాను. నీలి జెర్సీ వేసుకుని మైదానంలో బరిలో దిగితే లభించే అనుభూతి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. దేశం కోసం ఇన్నేళ్లు ఆడినందుకు ఆనందంగా ఉంది. ప్రపంచకప్ గెలవలేదన్న అసంతృప్తి మినహాయిస్తే కెరీర్పై పూర్తి సంతృప్తితో ఉన్నాను.

ఐదేళ్లలో..
సరైన ప్రణాళికతో ముందుకెళ్తే అయిదేళ్లలో భారత్ను నం.1 జట్టుగా చూడొచ్చు. ప్రస్తుతం జట్టులో నాణ్యమైన యువ ప్లేయర్లు చాలామంది ఉన్నారు. ఎస్.మేఘన, యాస్తిక, షెఫాలీ ఇప్పటికే తామేంటో నిరూపించుకున్నారు. ఇంకో పదేళ్లు జట్టులో కొనసాగే సత్తా వీరికుంది. వీళ్లతో పాటు జట్టులోని యువ క్రికెటర్లను నిలకడగా, బాధ్యతగా ఆడేలా తయారు చేస్తే మహిళల క్రికెట్కు మంచి భవిష్యత్తు ఉంటుంది. బ్యాటింగ్ పరంగా జట్టు ఆలోచించాల్సిన పనిలేదు. అయితే ప్రత్యేకంగా బౌలింగ్పై దృష్టిసారించాల్సిన అవసరముంది.


Click it and Unblock the Notifications












