
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తాజాగా ప్రకటించిన మహిళల వన్డే, టీ20 ర్యాంకింగ్స్లో భారత కెప్టెన్ మిథాలీ రాజ్, యువ ఓపెనర్ షెఫాలీ వర్మ దుమ్ము లేపారు. ఇంగ్లండ్తో జరిగిన మూడు వన్డేల సిరీస్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన మిథాలీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. దాదాపు 16 ఏళ్ల తర్వాత మళ్లీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో టాప్కు ఎగబాకింది. తన 22 ఏళ్ల కెరీర్లో ఎనిమిదో సారి ఈ ఘనత సాధించడం విశేషం. మరో స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన.. 701 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో నిలిచింది.
బౌలింగ్ విభాగంలో జూలన్ గోస్వామి(694 పాయింట్లు, 4వ స్థానం), పూనమ్ యూదవ్(617 పాయింట్లు, 9 స్థానం) తమ ర్యాంకుల్లో నిలిచారు. అయితే బౌలింగ్ ర్యాంకింగ్స్లో ఆస్ట్రేలియా క్రికెటర్లు జెస్ జొనాస్సెన్ (808 పాయింట్లు), మేఘన్ షట్(762 పాయింట్లు) వరుసగా తొలి రెండు స్థానాల్లో నిలిచారు. ఆల్రౌండర్ల విభాగంలో టీమిండియా మహిళా క్రికెటర్ దీప్తి శర్మ(331 పాయింట్లు) ఐదో ర్యాంకును దక్కించుకోగా.. మరిజన్నె కప్ (సౌతాఫ్రికా), ఎల్లిసా పెర్రి(ఆస్ట్రేలియా) తొలి రెండు స్థానాల్లో నిలిచారు.
టీ20 ర్యాంకింగ్స్ బ్యాటింగ్ విభాగంలో టాప్ -10లో ఇద్దరు భారత మహిళా క్రికెటర్లకు చోటు దక్కింది. అగ్రస్థానంలో షెఫాలీ వర్మ(776 పాయింట్లు), స్మృతి మంధాన(693) నాలుగో ర్యాంకుల్లో నిలిచారు. బౌలింగ్ విభాగంలో దీప్తి శర్మ(705), రాధా యాదవ్(702) ఐదు, ఆరు స్థానాలను కైవసం చేసుకున్నారు. ఆల్రౌండర్ విభాగంలో దీప్తి శర్మ.. 304 పాయింట్లతో ఐదో ర్యాంకులో ఉంది. సోఫీ డివైన్ (న్యూజిలాండ్, 359 పాయింట్లు) అగ్రస్థానంలో కొనసాగుతుంది.