
సిడ్నీ: ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్కు గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. ఐపీఎల్ 2018 సీజన్లో తనకు రావాల్సిన రూ.9.6 కోట్ల పారితోషకాన్ని ఈ స్టార్ పేసర్ కోల్పోనున్నాడు. 2018 సీజన్లో గాయం కారణంగా స్టార్క్ ఆడలేదు. ఆ ఏడాది అతన్ని కోల్కతా నైట్రైడర్స్ కొనుగోలు చేసింది. ఈ సీజన్ ముగిసిన తర్వాతా స్టార్క్ను కేకేఆర్ రిలీజ్ చేసింది. 2019 వన్డే ప్రపంచకప్ ఉండటంతో గత సీజన్ ఐపీఎల్లో స్టార్క్ ఆడలేదు. ఈ సీజన్కు సంబంధించి గత డిసెంబర్లో జరిగిన వేలంలోనూ తన పేరును నమోదు చేసుకోలేదు.
ఇక 2018 ఐపీఎల్కు సంబంధించి బకాయిలు ఇప్పించాలని పేర్కొంటూ.. విక్టోరియా కోర్టులో ఈ ఆస్ట్రేలియా పేసర్ కేసు దాఖలు చేశాడు. లాయిడ్స్ ఆఫ్ లండన్ అనే ఇన్సురెన్స్ కంపెనీని ప్రతివాదిగా పేర్కొన్నాడు. అయితే కేసును విచారించగా. ఉద్దేశ పూర్వకంగా స్టార్క్ ఐపీఎల్కు దూరమయ్యాడని, అతనికి అయిన గాయం ఆకస్మాత్తుగా కాలేదని ప్రత్యర్థి లాయర్లు కోర్టుకు తెలిపారు. అతనికి నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరం కూడా లేదని వాదించారు. ఈ నేపథ్యంలోనే స్టార్క్ వాదన వీగిపోయి.. ప్రత్యర్థి లాయర్లే గెలిచే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో స్టార్క్ వాదనలు వీగిపోతే.. అతను రూ.9.6 కోట్లు నష్టపోతాడు.
ఇక ఈ సీజన్ వేలంలో స్టార్క్ పాల్గొనకపోవడంతో ఆసీస్కే చెందిన ప్యాట్ కమిన్స్ భారీ ధరకు పలికాడు. అతడిని ఏకంగా రూ. 15.5 కోట్లకు కోల్కతా కొనుగోలు చేసింది. ఐపీఎల్లో అత్యధిక ధర పలికిన విదేశీ ప్లేయర్గా కమిన్స్ నిలిచాడు. ఇక ఐపీఎల్ 2020 సీజన్ కరోనా వైరస్ (కోవిడ్-19) కారణంగా వచ్చేనెల 15కు వాయిదా పడిన విషయం తెలిసిందే.