భారత బౌలర్లు అసాధారణ ప్రదర్శనతో తమ ఓటమిని శాసించారని న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ అన్నాడు. ఐదు టీ20ల సిరీస్లో భాగంగా గౌహతి వేదికగా జరిగిన మూడో టీ20లో సమష్టిగా రాణించిన టీమిండియా 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ను ఓడించింది. ఈ గెలుపుతో ఐదు టీ20ల సిరీస్ను 3-0తో మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే టీమిండియా కైవసం చేసుకుంది.
ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై మాట్లాడిన మిచెల్ సాంట్నర్.. ఈ ఓటమి తమకు ఓ గుణ పాఠమని చెప్పాడు. 'ఈ గెలుపు క్రెడిట్ టీమిండియా బౌలింగ్ విభాగానిదే. వారు మా ఆటను చాలా కష్టతరం చేశారు. పవర్ ప్లేలోనే వికెట్లు తీసి మమ్మల్ని దెబ్బతీసారు. మేం పోరాడి 150 పరుగులు చేశాం. ఈ స్కోర్తో గెలవడం సవాల్తో కూడుకున్న పనని మాకు తెలుసు. భారత్ మా కంటే మెరుగైన ప్రదర్శన చేసింది.

బ్యాటింగ్కు అనుకూలంగా ఉన్న ఈ వికెట్పై చెలరేగింది. చిన్న మైదానాలు, వేగవంతైమన ఔట్ ఫీల్డ్ ఉన్న కండిషన్స్లో వేగంగా పరుగులు రాబట్టింది. తొలి ఇన్నింగ్స్లో కట్టర్లు బాగా పనిచేశాయి. ముఖ్యంగా భారత్ అద్భుతంగా బౌలింగ్ చేసింది. మ్యాచ్ ఆరంభం నుంచే మమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టారు. పవర్ ప్లేలో మూడు వికెట్లు కోల్పోయినప్పుడు ఏ జట్టుకైనా కష్టమవుతుంది. నిజానికి ఇది 180 నుంచి 190 పరుగులు చేయాల్సి వికెట్. ఆటగాళ్లకు కొన్ని బాధ్యతలు అప్పగిస్తాం. అవి వారు పూర్తి చేయాలని కోరుకుంటాం.
మాకు ఇది రాబోయే టీ20 ప్రపంచకప్ మంచి సన్నద్దత. ఫ్లాట్ వికెట్పై ఆడటం ఒక అనుభవం. మా తొలి మ్యాచ్ చెన్నైలో అఫ్గానిస్థాన్తో ఉంది. ఆ మ్యాచ్ ఇక్కడి పరిస్థితులకు పూర్తి భిన్నంగా ఉండవచ్చు. ఈ అనుభవం మాకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. మరికొన్ని రోజుల్లోనే మేం మళ్లీ మరో మ్యాచ్ బరిలోకి దిగుతాం. ఆ మ్యాచ్లో మెరుగైన ప్రదర్శన చేయడానికి ప్రయత్నిస్తాం.'అని మిచెల్ సాంట్నర్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 153 పరుగులు చేసింది. గ్లేన్ ఫిలిప్స్(40 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 48), మార్క్చాప్మన్(23 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 32), మిచెల్ సాంట్నర్(17 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 27) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా(3/17) మూడు వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా, రవి బిష్ణోయ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. హర్షిత్ రాణా(1/35) ఒక వికెట్ తీసాడు.
అనంతరం భారత్ 10 ఓవర్లలో 2 వికెట్లకు 155 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. అభిషేక్ శర్మ(20 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్లతో 68 నాటౌట్), సూర్యకుమార్ యాదవ్(26 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్లతో 57 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ, ఇష్ సోధీ తలో వికెట్ తీసారు. ఇరు జట్లు మధ్య నాలుగో టీ20 బుధవారం విశాఖపట్నం వేదికగా జరగనుంది.