
న్యూఢిల్లీ: భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మూడు టీ20ల సిరీస్ అర్థం పర్థం లేనిదని కివీస్ మాజీ పేసర్ మిచెల్ మెక్లన్గన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. టీ20 ప్రపంచకప్ ముగిసిన మూడో రోజుల్లోనే ఈ సిరీస్ను షెడ్యూల్ చేయడం బాలేదన్నాడు. దాంతో కివీస్ ఆటగాళ్లకు సరైన విశ్రాంతి లభించలేదన్నాడు. బిజీ షెడ్యూల్ కారణంగానే న్యూజిలాండ్ సిరీస్ కోల్పోయిందని చెప్పుకొచ్చాడు. నేడు(ఆదివారం) కోల్కతా వేదికగా జరిగే మూడో టీ20తో ఈ సిరీస్ ముగియనుంది. ఇప్పటికే రెండు మ్యాచ్ల్లో గెలుపొందిన భారత్ 2-0తో మరో మ్యాచ్ మిగిలుండగానే విజయాన్నందుకుంది.
నవంబరు 14న టీ20 వరల్డ్కప్ 2021 ఫైనల్ మ్యాచ్ ముగియగా.. ఈ ఫైనల్కి చేరిన న్యూజిలాండ్ టీమ్ రన్నరప్తో సరిపెట్టుకుంది. ఆ తర్వాత మూడు రోజుల్లోనే అంటే 17న జైపూర్లో ఫస్ట్ టీ20 మ్యాచ్ ఆడిన కివీస్.. 19న రాంచీ వేదికగా రెండో టీ20లో భారత్తో తలపడింది. మరోవైపు టీ20 వరల్డ్కప్లో గ్రూప్ దశలోనే ఇంటిబాట పట్టిన టీమిండియాకి దాదాపు 10 రోజులు రెస్ట్ దొరికింది. దాంతో.. బిజీ షెడ్యూల్ కివీస్ ఓటమికి కారణమైందని మెక్లనగన్ చెప్పుకొచ్చాడు.
'భారత్, న్యూజిలాండ్ మధ్య టీ20 సిరీస్ అర్థం పర్థం లేనిది. టీ20 వరల్డ్కప్ 2021 ఫైనల్లో ఓటమి తర్వాత కేవలం 72 గంటల్లోనే సిరీస్ ప్రారంభమైంది. అది కూడా కేవలం 5 రోజుల వ్యవధిలో మూడు టీ20 మ్యాచ్లు నిర్వహిస్తున్నారు. మరోవైపు ప్రత్యర్థి (భారత్)కి 10 రోజులు రెస్ట్ దొరికింది.. అది కూడా సొంతగడ్డపై ఆడుతోంది'' అని చెప్పుకొచ్చాడు. మెక్లన్ గన్ వ్యాఖ్యలతో అభిమానులు కూడా ఏకీభవిస్తున్నారు. బయో- సెక్యూర్ బబుల్లో ఉన్న ఆటగాళ్లకి కాస్త విరామం ఇవ్వాల్పిందని అభిప్రాయపడుతున్నారు. ఈ తరహా ప్రవర్తనతోనే బీసీసీఐ మూల్యం చెల్లించుకుందని, తీరిక లేని షెడ్యూల్ కారణంగానే టీ20 ప్రపంచకప్లో టీమిండియా కనీసం సెమీస్ చేరకుండా ఇంటి దారి పట్టిందని ఫ్యాన్స్ మండిపడుతున్నారు.