టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్తో తమ ఓటమిని శాసించాడని ఆస్ట్రేలియా టీ20 కెప్టెన్ మిచెల్ మార్ష్ అన్నాడు. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా సోమవారం జరిగిన తమ చివరి సూపర్-8 మ్యాచ్లో సమష్టిగా రాణించిన టీమిండియా 24 పరుగుల తేడాతో ఆసీస్ను ఓడించింది.
ఈ విజయంతో గ్రూప్-1 టాపర్గా టీమిండియా సెమీఫైనల్కు దూసుకెళ్లింది. ఆస్ట్రేలియా మాత్రం తమ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఇతర జట్ల జయాపజయాలపై ఆసీస్ సెమీస్ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి.

ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 205 పరుగుల భారీ స్కోర్ చేసింది. రోహిత్ శర్మ(41 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్లతో 92), సూర్యకుమార్ యాదవ్(16 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 31) విధ్వంసకర బ్యాటింగ్తో రాణించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్(2/45), మార్కస్ స్టోయినీస్(2/56) రెండేసి వికెట్లు తీయగా.. జోష్ హజెల్వుడ్ ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 181 పరుగులు చేసి ఓటమిపాలైంది. ట్రావిస్ హెడ్(43 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 76) హాఫ్ సెంచరీతో రాణించగా.. మిచెల్ మార్ష్(28 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 37) పర్వాలేదనిపించాడు. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు.
భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్(3/37) మూడేసి వికెట్లు తీయగా.. కుల్దీప్ యాదవ్(2/24) రెండు వికెట్లు పడగొట్టాడు. జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్ తలో వికెట్ తీసారు.
ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన మిచెల్ మార్ష్.. టీమిండియా ఆటగాళ్లు అసాధారణ ప్రదర్శన కనబర్చారని కొనియాడాడు. బ్యాటింగ్లో రోహిత్ తన క్లాస్ చూపించాడని ప్రశంసించాడు.
'ఈ ఓటమి తీవ్రంగా నిరాశపరిచింది. క్రికెట్లో అప్పుడప్పుడు ఇలాంటి ఫలితాలు ఎదురవ్వడం సాధారణమే. 40 ఓవర్ల మ్యాచ్ల్లో చిన్న చిన్న అవకాశాలు దక్కుతాయి. వాటిని అందిపుచ్చుకున్న జట్టుకే విజయవకాశాలు ఉంటాయి. భారత్ అసాధారణమైన జట్టు. రోహిత్ శర్మ క్లాస్ ప్లేయర్. విధ్వంసకర బ్యాటింగ్తో టీమిండియాకు అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు. మ్యాక్స్వెల్, ట్రావిస్ హెడ్ మా జట్టును విజయం దిశగా నడిపారు.
వారి బ్యాటింగ్తో విజయాన్ని అందిస్తారనే నమ్మకం కలిగించారు. భారీ లక్ష్యచేధనలో దూకుడుగా ఆడాలి. ఓవర్కు 10 రన్స్ చేయాలి. సగం మ్యాచ్ వరకు ఈ గేమ్ మా చేతుల్లోనే ఉంది. కానీ భారత బౌలర్లు అద్భుతంగా పుంజుకున్నారు. అసాధారణ ప్రదర్శనతో మ్యాచ్ను లాగేసుకున్నారు. ఈ పరాజయం నేపథ్యంలో మేం అఫ్గానిస్థాన్పై బంగ్లాదేశ్ విజయం సాధించాలని కోరుకుంటాం' అని మిచెల్ మార్ష్ చెప్పుకొచ్చాడు.