సొంతగడ్డపై టీమిండియాతో మూడు వన్డేల సిరీస్లో ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. పెర్త్ వేదికగా ఆదివారం జరిగిన తొలి మ్యాచ్లో సమష్టిగా రాణించిన ఆసీస్ డక్వర్త్ లూయిస్ పద్దతిన 7 వికెట్ల తేడాతో టీమిండియాను చిత్తు చేసింది.
ఓవర్కాస్ట్ కండిషన్స్తో పాటు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం, కుర్రాళ్లు సత్తా చాటడం తమ విజయానికి కారణమని ఆస్ట్రేలియా తాత్కలిక కెప్టెన్ మిచెల్ మార్ష్ అన్నాడు. జట్టులోకి వచ్చిన యువ ఆటగాళ్లు కూడా మెరుగైన ప్రదర్శన చేశారని కొనియాడాడు. మ్యాచ్ అనంతరం బ్రాడ్కాస్టర్తో మాట్లాడిన మిచెల్ మార్ష్.. ఈ మ్యాచ్ కోసం స్టేడియానికి వచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపాడు. వన్డేలకు ఇంతలా జనాలు రావడం గతంలో చూడలేదని చెప్పాడు. ఈ క్రెడిట్ పూర్తిగా భారత్దేనని చెప్పాడు.
'ఈ రోజు వాతావరణం దాన్ని ప్రభావాన్ని చూపింది. ఓవర్కాస్ట్ కండీషన్స్లోనూ స్టేడియానికి వచ్చిన అభిమానులకు ధన్యవాదాలు. ఇలాంటి రోజులు నిరాశకు గురి చేస్తాయి. కానీ విజయం దక్కడం సంతోషంగా ఉంది. సొంతగడ్డపై గెలవడం ఎప్పుడూ సంతోషంగానే ఉంటుంది. ఆసీస్ తరఫున ఆడటం నాకు చాలా ఇష్టం.

బంతి స్వింగ్ అవుతుందని భావించే ఛేజింగ్కు మొగ్గు చూపాను. రెండు జట్లకు స్వింగ్ లభిస్తుందని తెలుసు. కాబట్టి స్వింగ్ను ఎదుర్కోవడం కొంచెం సవాల్గా అనిపించింది. మా యువ ఆటగాళ్లు ధైర్యంగా ఆడి మమ్మల్ని గెలిపించిన తీరు గర్వంగా ఉంది. జోష్ ఫిలిప్ అద్భుతంగా ఆడాడు. యువ ఆటగాళ్లు జట్టులోకి రావడం సరదాగా ఉంటుంది. వారు పిల్లలు కాకపోయినా.. ఆటను ఆస్వాదిస్తూ సరదాగా ఉండాలని కోరుకుంటాను. వన్డే క్రికెట్లో మేం ఎప్పుడూ ఇంత క్రౌండ్ను చూడలేదు. అందుకే మా కుర్రాళ్లను ఈ క్షణాలను ఆస్వాదించాలని చెప్పాను.'అని మిచెల్ మార్ష్ చెప్పుకొచ్చాడు.
ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 26 ఓవర్లలో 9 వికెట్లకు 136 పరుగులు చేసింది. డక్వర్త్ లూయిస్ ప్రకారం ఆస్ట్రేలియా లక్ష్యాన్ని 26 ఓవర్లలో 131 పరుగులుగా నిర్ణయించారు. ఆసీస్ 21.1 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. కెప్టెన్ మిచెల్ మార్ష్(52 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 46 నాటౌట్), జోష్ ఫిలిప్(29 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 37), మ్యాట్ రేన్షా(24 బంతుల్లో ఫోర్, సిక్స్తో 21 నాటౌట్) రాణించారు. ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన మిచెల్ మార్ష్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ దక్కింది.