సొంతగడ్డపై భారత్తో ఐదు టీ20ల సిరీస్ను కోల్పోయినా.. తానే ఆసీస్ టీ20 కెప్టెన్గా కొనసాగుతానని మిచెల్ మార్ష్ స్పష్టం చేశాడు. భారత్ వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్ 2026లో ఆసీస్ను తానే నడిపిస్తానని తెలిపాడు. ఐదు టీ20ల సిరీస్లో భాగంగా బ్రిస్బేన్లోని గబ్బా మైదానం వేదికగా శనివారం జరిగిన ఆఖరి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. దాంతో ఈ సిరీస్ను టీమిండియా 2-1తో కైవసం చేసుకుంది. ఈ ఐదు మ్యాచ్ల సిరీస్లో తొలి, ఆఖరి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది.
'ఇన్ని వర్ష అంతరాయాల మధ్య ఎప్పుడు ఆడామో కూడా నాకు గుర్తు లేదు. ఏది ఏమైనా ఇది ఒక గొప్ప సిరీస్. ముఖ్యమైన మ్యాచ్లను భారత్ గెలుచుకుంది. వారికి అభినందనలు. ఈ సిరీస్లో ఓడినా మేం నేర్చుకోవాల్సిన విషయాలు, సానుకూల అంశాలు చాలా ఉన్నాయి.

ప్రపంచకప్ కోసం మేం నిర్మించాలనుకుంటున్న జట్టులో ఉండాల్సిన అనుకూలత, సౌలభ్యం ఈ సిరీస్లో లభించింది. మా ఆటగాళ్లు వచ్చిన అవకాశాన్ని అద్భుతంగా వాడుకున్నారు. తమ పాత్రలను పోషించారు. అంతర్జాతీయ క్రికెట్లో ఎప్పుడూ మార్పులు జరుగుతూనే ఉంటాయి. ముఖ్యంగా యాషెస్ సిరీస్ నేపథ్యంలో మార్పులు చేయాల్సి వచ్చింది. అయినా మా జట్టు గొప్ప ఇంటెంట్ చూపించింది. మా ఆటగాళ్లకు బిగ్ బాష్ లీగ్ ఉంది. స్కాచర్స్ గెలవాలని ఆశిస్తున్నాను. టీ20 ప్రపంచకప్ కెప్టెన్ ఎవరా? అనేది మంచి ప్రశ్న. అయితే నేనే కెప్టెన్గా కొనసాగుతాను.'అని మిచెల్ మార్ష్ చెప్పుకొచ్చాడు.
ఆఖరి టీ20లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ మ్యాచ్ ఆగిపోయే సమయానికి 4.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 52 పరుగులు చేసింది. ఓపెనర్లు శుభ్మన్ గిల్(16 బంతుల్లో 6 ఫోర్లతో 29 బ్యాటింగ్), అభిషేక్ శర్మ(13 బంతుల్లో ఫోర్, సిక్స్తో 23) దూకుడుగా ఆడారు.
బెన్ ద్వార్షూయిస్ వేసిన తొలి ఓవర్లోనే ఐదు పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అభిషేక్ శర్మ ఇచ్చిన సునాయస క్యాచ్ను గ్లేన్ మ్యాక్స్వెల్ నేలపాలు చేయగా.. 11 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద నాథన్ ఎల్లిస్ బౌలింగ్లో ఇచ్చిన మరో ఈజీ క్యాచ్ను ద్వార్షూయిస్ చేజార్చాడు. ఈ రెండు అవకాశాలతో అభిషేక్ శర్మ చెలరేగాడు. గత మూడు టీ20ల్లో పేలవ ఫామ్తో సతమతమైన శుభ్మన్ గిల్...ఈ మ్యాచ్లో మాత్రం స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశాడు. అభిషేక్ తడబడినా వరుస బౌండరీలతో జోరు కనబర్చాడు.
ఈ క్రమంలో ప్రతికూల వాతావరణం మ్యాచ్కు అడ్డంకిగా మారింది. వర్షం రాకపోయినా.. మైదానాన్ని మబ్బులు కమ్మేయడంతో పాటు భారీ ఉరుములతో కూడిన గాలివాన వస్తుందనే హెచ్చరికల నేపథ్యంలో అంపైర్లు ఆటను నిలిపేసారు. ఆ కాసేపటికే భారీ వర్షం కురవడంతో ఆట సాధ్యం కాలేదు. వర్షం మరింత పెరగడంతో అంపైర్లు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.