బ్యాటింగ్ వైఫల్యంతోనే ఓటమిపాలయ్యామని ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ అన్నాడు. మరో 20 పరుగులు అదనంగా చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదని అభిప్రాయపడ్డాడు. ఐదు టీ20ల సిరీస్లో భాగంగా ఆదివారం హోబర్ట్ వేదికగా జరిగిన మూడో టీ20లో సమష్టిగా రాణించిన భారత్ 5 వికెట్ల తేడాతో ఆసీస్ను ఓడించింది. ఈ గెలుపుతో ఐదు మ్యాచ్ల సిరీస్లో 1-1తో సమంగా నిలిచింది. ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన మిచెల్ మార్ష్.. భారత్ అద్భుతంగా బౌలింగ్ చేసిందని కొనియాడాడు. ఈ విజయానికి వారు పూర్తి అర్హులని తెలిపాడు.
'బ్యాటింగ్లో మేం 20 పరుగులు తక్కువగా చేశాం. ఈ క్రెడిట్ టీమిండియాదే. వారి బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఫీల్డింగ్లో మా సాయశక్తులా ప్రయత్నించాం. కానీ విజయం వారికే దక్కింది. ముందుగా బ్యాటింగ్ చేయడం ద్వారా నేర్చుకున్న విషయాలు ఏంటంటే.. మా లక్ష్యాన్ని మేం 20 పరుగులు అదనంగా చేయాల్సింది. ఆరంభంలో వికెట్లు కోల్పోయినా మా బ్యాటర్లు చూపించిన ఇంటెంట్ అద్భుతం. ముఖ్యంగా టీమ్ డేవిడ్ ఆడిన తీరు అమోఘం. చివర్లో స్టోయినీస్ కూడా తన అనుభవాన్ని చూపించాడు. టీ20ల్లో ఒకటి, రెండు మంచి ఓవర్లే లేదా చెడ్డ ఓవర్లు మ్యాచ్ ఫలితాన్ని మార్చేస్తాయి.

గ్లేన్ మ్యాక్స్వెల్ పూర్తి ఫిట్నెస్ సాధించాడు. దాదాపు ఈ మ్యాచ్కే అతను బరిలోకి దిగాల్సింది. కానీ గురువారం జరిగే నాలుగో టీ20లో అతను ఆడుతాడు. అతను ఎంతో అనుభవం కలిగిన టీ20 ప్లేయర్. అతని రీఎంట్రీతో మా జట్టు బలం పెరుగుతుంది. అతని రాక కోసం ఎదురు చూస్తున్నాం.'అని మిచెల్ మార్ష్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 186 పరుగులు చేసింది. టీమ్ డేవిడ్(38 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్లతో 74), మార్కస్ స్టోయినీస్(39 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లతో 64) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్(3/31) మూడు వికెట్లు తీయగా.. వరుణ్ చక్రవర్తీ(2/33) రెండు వికెట్లు తీయగా.. శివమ్ దూబే(1/43) ఒక వికెట్ పడగొట్టాడు.
అనంతరం భారత్ 18.3 ఓవర్లలో 5 వికెట్లకు 188 పరుగులు చేసి గెలుపొందింది. వాషింగ్టన్ సుందర్(23 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 49 నాటౌట్), జితేష్ శర్మ(13 బంతుల్లో 3 ఫోర్లతో 22 నాటౌట్), తిలక్ వర్మ(26 బంతుల్లో ఫోర్, సిక్స్తో 29) రాణించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన్ ఎల్లిస్ మూడు వికెట్లు తీయగా.. గ్జేవియర్ బార్ట్లెట్, మార్కస్ స్టోయినీస్ తలో వికెట్ తీసారు. ఈ గెలుపుతో ఐదు మ్యాచ్ల సిరీస్లో భారత్ 1-1తో కొనసాగుతుంది. నాలుగో టీ20 గురువారం గోల్డ్ కోస్ట్ వేదికగా జరగనుంది. తొలి మ్యాచ్ వర్షార్పణం కాగా.. రెండో టీ20 ఆసీస్ గెలిచిన సంగతి తెలిసిందే.