చప్పగా సాగుతున్న ఆసియా కప్ 2025లో హీటెక్కించే భారత్, పాకిస్థాన్ పోరుకు రంగం సిద్దమైంది. మరికొద్ది సేపట్లో ఈ హైఓల్టేజ్ మ్యాచ్కు తెరలేవనుంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తర్వాత ఇరు జట్లు తలపడుతుండటం ఇదే తొలిసారి. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత ఈ మ్యాచ్ జరుగుతుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
అయితే ఈ మ్యాచ్లో భారత్ను ఓడించేందుకు పాకిస్థాన్కు ఇదే సువర్ణవకాశమని ఆ జట్టు మాజీ కెప్టెన్ మిస్బా-ఉల్-హక్ అన్నాడు. భారత జట్టులో విరాట్ కోహ్లీ లేకపోవడం పాకిస్థాన్ జట్టుకు కలిసొచ్చే అంశమని చెప్పాడు. ఆరంభంలోనే భారత్ వికెట్లు తీస్తే పాకిస్థాన్ పైచేయి సాధించవచ్చని చెప్పాడు. టీ20 ప్రపంచకప్ 2024 విజయానంతరం విరాట్ కోహ్లీతో పాటు రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా పొట్టి ఫార్మాట్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.

భారత్, పాకిస్థాన్ మ్యాచ్ నేపథ్యంలో తాజాగా ఓ స్థానిక మీడియాతో మాట్లాడిన మిస్బా-ఉల్-హక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'పాకిస్థాన్కు కచ్చితంగా గెలిచే అవకాశం ఉంది. ఆరంభంలోనే భారత్ వికెట్లు కోల్పోతే పాక్ పై చేయి సాధించవచ్చు. ఎందుకంటే జట్టులో విరాట్ కోహ్లీ కూడా లేడు. భారత బ్యాటింగ్ లైనప్ కూడా భిన్నంగా ఉంది. అంతేకాకుండా భారత బ్యాటర్లలో చాలా మందికి పాకిస్థాన్ బౌలర్లను ఎదుర్కొన్న అనుభవం లేదు. కాబట్టి పాకిస్థాన్ బౌలింగ్కు ఒక అవకాశం ఉంది.
టీమిండియా టాపార్డర్ను త్వరగా పెవిలియన్ చేర్చితే.. పాకిస్థాన్కు గెలిచే అవకాశం దక్కుతుంది. అలాంటి పరిస్థితుల్లోనూ పాకిస్థాన్కు శుభారంభం దక్కాల్సిన అవసరం ఉంది.'అని మిస్బా-ఉల్-హక్ చెప్పుకొచ్చాడు. మిస్బా-ఉల్-హక్ చెప్పినట్లు ప్రస్తుత భారత జట్టులో వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్తో పాటు అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, తిలక్ వర్మ, కుల్దీప్ యాదవ్, శివమ్ దూబేలకు పాకిస్థాన్పై ఆడిన అనుభవం లేదు. తాజా మ్యాచ్తోనే వారు పాకిస్థాన్పై తొలి మ్యాచ్ ఆడనున్నారు. ఇది భారత అభిమానులను కలవరపెడుతుంది.