
ఓవర్ కాన్ఫిడెన్స్..
తాజాగా తన మాజీ సహచర ఆటగాళ్లు షోయబ్ అక్తర్, మహమ్మద్ యూసఫ్తో కలిసి ఓ టీవీ షోలో మాట్లాడిన మిస్బా ఉల్ హక్.. ఆ పెడల్ స్వీప్ షాట్ మిస్ ఫైర్ అవ్వడానికి గల కారణాన్ని తెలియజేశాడు. తనకు ఎంతో ఫేవరేట్ షాట్ అయిన అది ఆ రోజు అతి విశ్వాసం కారణంగా మిస్ ఫైర్ అయ్యిందన్నాడు. '2007లో ప్రతి మ్యాచుల్లో స్కూప్ షాట్తో ఎన్నో ఫోర్లు బాదాను. ఆస్ట్రేలియాపై కూడా ఆ షాట్తో బాగా ఆడాను. స్పిన్నర్లపై మంచి ప్రదర్శన చేశాను. కానీ ఫైనల్లో ఆ బంతి బాదేటప్పుడు నాలో ఆత్మవిశ్వసం ఎక్కువైంది. దీంతో బంతిని కొట్టే టైమింగ్ తప్పింది. అందుకే ఔట్ అయ్యాను" అని మిస్బా ఉల్ హక్ చెప్పుకొచ్చాడు.

నా ఫేవరేట్ షాట్..
'ఆ ఓటమి వల్ల ఏర్పడిన బాధ ఇంకా ఉంది. నా కట్టే కాలేవరకు అది ఉండిపోతుంది. ఎందుకంటే అక్కడ గెలుపే ముఖ్యం. ఆ ఓటమితో నేను చాలా నిరుత్సాహానికి గురయ్యా. ఎందుకంటే ఫలితం దక్కనప్పుడు మనం పడిన కష్టమంతా వృథా అవుతుంది. నేను మ్యాచ్ను చివరి వరకూ తీసుకెళ్లాను. సునాయసంగా గెలిచే మ్యాచ్ చేజారడం చాలా బాధను మిగిల్చింది. జరిగిందేదో జరిగిందని మర్చిపోదామన్నా కుదరడం లేదు. నేను ఆ షాట్ ఆడి తప్పు చేశానని చాలా మంది అంటుంటారు. కానీ, అది నిజం కాదు. నేను ఇంతకు ముందెప్పుడూ పెడల్ స్వీప్ షాట్ ఆడి ఔట్ కాలేదు. అది నా ఫేవరెట్ షాట్.

పై నుంచి ఆడుదామని..
ఫీల్డర్ ఫైన్ లెగ్ కంటే వెనకుంటే ఆ షాట్తో నాకు సింగిల్ వచ్చేది. ఆస్ట్రేలియాతో ఆడిన మ్యాచ్లో కూడా నేను అదే షాట్ కొట్టాను. స్కోర్ సమం చేయాలనుకున్నాను. అందుకే వికెట్ కీపర్పై నుంచి ఫోర్ కొట్టాలని భావించా. వాళ్లు ఫీల్డర్ను వెనక పెట్టుంటే, నేను సింగిల్ తీసుండేవాడిని. దగ్గరగా పెట్టడంతో అతని పైనుంచి కొట్టాలనుకున్నా. కానీ, ఆ పెడల్ స్వీప్ షాట్ మిస్ ఫైర్ అయింది. ఔటవ్వగానే నా ప్రయత్నాలన్నీ వృథా అయ్యాయి. నేను ఆడే బెస్ట్ షాట్ అదేనని నాకు ఇప్పటికీ అనిపిస్తుంది. కానీ, ఆ సమయంలో సక్సెస్ కాలేదు.'అని మిస్బా పేర్కొన్నాడు.

గెలిచే మ్యాచ్లో..
157 పరుగుల లక్ష్య ఛేదనలో పాకిస్థాన్ తడబడింది. షాహిద్ అఫ్రిది, యూనిస్ ఖాన్, మాలిక్ వంటి దిగ్గజ బ్యాటర్లను టీమ్ఇండియా బౌలర్లు త్వరగా పెవిలియన్ చేర్చారు. కానీ మిస్బా ఉల్ హక్ మాత్రం ధనాధన్ ఇన్నింగ్స్ ఆడి విజయానికి చాలా దగ్గరకు తీసుకొచ్చాడు. ఇక పాక్ గెలుపు ఖాయమని అభిమానులు భావించారు. ఆ జట్టుకు చివరి ఓవర్లో 13 పరుగలు మాత్రమే అవసరం. ఆ ఓవర్లో జోగిందర్ శర్మ వేసిన రెండో బంతిని సిక్సర్గా మలిచి భారత్ గెలుపు ఆశలపై నీళ్లు చల్లాడు. ఇక మూడో బంతికి స్కూప్ షాట్ ఆడబోయి శ్రీశాంత్ చేతికి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. దీంతో భారత్ ఐదు పరుగుల తేడాతో గెలిచింది.


Click it and Unblock the Notifications












