కామన్వెల్త్ ఛాంపియన్షిప్లో భారత స్టార్ వెయిట్లిఫ్టర్ మీరాబాయి చాను స్వర్ణ పతకం సాధించింది. ఏడాది విరామం తర్వాత పునరాగమనం చేసిన చాను.. రికార్డ్ ప్రదర్శన కనబర్చింది. అహ్మదాబాద్ వేదికగా సోమవారం జరిగిన మహిళల 48 కేజీల విభాగంలో 193 కిలోలు ఎత్తి విజేతగా నిలిచింది. ఇది ఛాంపియన్షిప్ రికార్డ్. గత రికార్డ్ కన్న చాను 14 కిలోలు ఎక్కువ బరువు ఎత్తింది. స్నాచ్లో 84 కిలోలు ఎత్తిన చాను.. క్లీన్ అండ్ జెర్క్లో 109 కిలోలు ఎత్తింది.
మలేసియాకు చెందిన ఇరెన్ హెన్రీ 161 కేజీలు ఎత్తి రజతం సాధించగా.. వేల్స్ అమ్మాయి నికోల్ రాబర్ట్స్ 150 కిలోలతో బ్రాంజ్ మెడల్ అందుకుంది. జూనియర్ విభాగంలో సౌమ్య దాల్వీ పసిడి పతకం సాధించింది. పురుషుల 60 కేజీల విభాగంలో రిషికంఠ సింగ్ స్వర్ణం గెలుచుకున్నాడు. అతను 271 కిలోల బరువు ఎత్తాడు. స్నాచ్లో 120 కిలోలు ఎత్తిన రిషికంఠ.. క్లీన్ అండ్ జెర్క్లో 151 కిలోలు ఎత్తాడు.

ఈ విజయంపై మీరాబాయి చాను సంతోషం వ్యక్తం చేసింది. 'అహ్మదాబాద్లో స్వర్ణం గెలవడం సంతోషం ఉంది. పారిస్ ఒలింపిక్స్ అనంతరం ఏడాది విరామంతో బరిలోకి దిగిన తొలి టోర్నీలో విజయం సాధించడం నా ఆనందాన్ని రెట్టింపు చేసింది. అది కూడా సొంతగడ్డపై సాధించడంతో ఈ గెలుపు మరింత ప్రత్యేకంగా మారింది. ప్రేక్షకుల నుంచి లభించిన ప్రోత్సాహం నాకు చాలా ఉత్సాహాన్నిచ్చింది.
నా కష్టంతో పాటు కోచ్ల గైడెన్స్, దేశ ప్రజల మద్దతుకు దక్కిన ఫలితం ఇది. అక్టోబర్లో జరగనున్న ప్రపంచ ఛాంపియన్షిప్స్కు ముందు దక్కిన ఈ విజయం నా ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. అంతర్జాతీయ వేదికపై దేశం గర్వపడే ప్రదర్శనలను ఇచ్చేందుకు నా వంతు కృషి చేస్తాను.'అని మీరాబాయి చెప్పుకొచ్చింది.