ఆసియా కప్ 2025 కోసం ఎంపిక చేసిన పాకిస్థాన్ జట్టులో సీనియర్ ఆటగాళ్లు అయిన బాబర్ ఆజామ్, మహమ్మద్ రిజ్వాన్లకు చోటు దక్కలేదు. 17 మంది సభ్యులతో కూడిన పాకిస్థాన్ జట్టును ఆదేశ సెలెక్టర్లు ఆదివారం ప్రకటించారు. బాబర్ ఆజామ్, మహమ్మద్ రిజ్వాన్లతో పాటు నసీమ్ షాకు కూడా చోటు దక్కలేదు.
ఆల్రౌండర్ సల్మాన్ అలీ అఘా సారథ్యంలో పాకిస్థాన్ ఆసియా కప్ 2025 బరిలోకి దిగుతోంది. సెప్టెంబర్ 9 నుంచి యూఈఏ వేదికగా టీ20 ఫార్మాట్లో ఆసియా కప్ 2025 ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 14న చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్థాన్ మధ్య హైఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది.
బాబర్ ఆజామ్, మహమ్మద్ రిజ్వాన్పై వేటు వేయడం ఆ దేశ అభిమానులతో పాటు యావత్ క్రికెట్ ప్రపంచాన్ని షాక్కు గురి చేసింది. బాబర్ ఆజామ్ గతేడాదిగా ఒక్క టీ20 మ్యాచ్ ఆడలేదు. బాబర్ ఆజామ్ను తప్పించడానికి గల కారణాన్ని ఆ జట్టు వైట్ బాల్ ఫార్మాట్ హెడ్ కోచ్ మైక్ హెస్సెన్ తెలిపాడు. జిడ్డు బ్యాటింగ్తో పాటు పేలవ ఫామ్ కారణంగానే బాబర్ ఆజామ్ను తప్పించినట్లు పేర్కొన్నాడు.

'బాబర్ ఆజామ్ అద్భుతమైన ఆటగాడు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కానీ తన బ్యాటింగ్లో చాలా లోపాలు ఉన్నాయి. వాటిని సరిచేసుకోవాల్సిన అవసరం బాబర్ ఆజామ్కు ఉంది. ముఖ్యంగా స్పిన్ బౌలర్లను ఎదుర్కోవడంలో బాబర్ ఆజామ్ తడబడుతున్నాడు. అంతేకాకుండా అతని స్ట్రైక్రేట్ కూడా చాలా తక్కువగా ఉంది. టీ20ల్లో స్ట్రైక్ రేట్ చాలా కీలకం. అతను చాలా మెరుగ్వాలి. కఠినంగా ట్రైన్ అవ్వాలి. అతను కూడా బ్యాటింగ్ను మెరుగుపర్చుకోవడంపై ఫోకస్ పెట్టాడు.
ఆస్ట్రేలియా వేదికగా జరిగే బిగ్ బాష్ లీగ్లో పాల్గొనేందుకు సిద్దమవుతున్నాడు. ఆ టోర్నీ అతని ఆట మెరుగుపడేందుకు సహాయపడుతుంది. ఆసియా కప్కు ఎంపికైన పాకిస్థాన్ జట్టులో మెరుగైన ప్రదర్శన చేసే ఆటగాళ్లు ఉన్నారు. ముఖ్యంగా ఫర్హాన్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. గత మూడు మ్యాచ్ల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. టీ20ల్లో విజయం సాధించాలంటే రన్ రేట్ కీలకం. భారీ లక్ష్యాన్ని నమోదు చేస్తేనే మ్యాచ్ గెలవగలం'అని మైక్ హెస్సేన్ చెప్పుకొచ్చారు.