
లండన్: ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాలో పర్యటించనున్న టీమిండియా టెస్ట్ సిరీస్ను గెలవడం అంత ఈజీ కాదని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైక్ అథర్టన్ అన్నాడు. ఆసీస్ పర్యటనకు సరైన పేస్ బౌలింగ్ వ్యూహాలు లేకుండా వెళితే భారత్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించాడు. భారత్ బ్యాటింగ్ లైనప్ ఎంత బలంగా ఉన్నా బౌలింగ్తోనే ఆసీస్పై పైచేయి సాధించే అవకాశం ఉందన్నాడు.
'గత కొన్నేళ్లుగా భారత పేస్ బౌలర్లలో వేగం పెరిగింది. ఇండియాలో చాలా మంది పేసర్లు పుట్టుకొస్తున్నారు. బలమైన పేస్ బౌలింగ్తో టీమిండియా పటిష్టంగా ఉంది. నేను చూసిన భారత జట్టుకు, ప్రస్తుత టీమ్కు చాలా తేడా ఉంది. నేను ఆడిన (1993) సమయంలో భారత్ స్పిన్పైనే ఆధారపడేది. అప్పుడు కూడా ఫాస్ట్ బౌలర్లు ఉన్నా, ఇప్పుడు ఉన్నంత బలం లేదు. భారత్కు పేస్ బౌలింగ్ ఇప్పుడు అదనపు బలం. ఆసీస్ను పేస్ బౌలింగ్తో భయపడితేనే వారిపై పైచేయి సాధించవచ్చు.
బ్యాటింగ్లో భారత్ బలాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రోహిత్ శర్మ ఎర్రబంతితో కూడా బాగా రాణిస్తున్నాడు. అతనికి జతగా ఓపెనర్గా దిగే మయాంక్ అగర్వాల్ యావరేజ్ కూడా బాగుంది. విరాట్ కోహ్లీ, చతేశ్వర పుజారాలతో టాపార్డర్ బలంగా ఉంది. ఓవరాల్గా టీమిండియా బ్యాటింగ్ పటిష్టంగానే ఉంది. కానీ పేస్ బౌలింగ్తో ఆసీస్ పని పట్టకపోతే బ్యాటింగ్ ఎంత బలంగా ఉన్నా అనవసరం'అని అథర్టన్ అభిప్రాయపడ్డాడు.
ఇక 2018-19 సీజన్లో ఆసీస్పై సాధించిన టెస్టు సిరీస్ విజయాన్ని టీమిండియా రిపీట్ చేయాలంటే పేస్ బౌలింగ్తో చెలరేగిపోవాలన్నాడు. ఆస్ట్రేలియాలో కూకాబుర్రా బంతులు ఉపయోగించడంతో అవి వెంటనే మెరుపును కోల్పోయి బ్యాటింగ్కు అనుకూలించే అవకాశం ఉందన్నాడు.