ఇంగ్లండ్తో నాలుగో టెస్ట్లో టీమిండియా పుంజుకోవాలంటే కెప్టెన్ శుభ్మన్ గిల్ తన మైండ్సెట్ను మార్చుకోవాలని మాజీ క్రికెటర్ మైఖేల్ వాన్ అన్నాడు. విరాట్ కోహ్లీ తరహాలో దూకుడుగా కెప్టెన్సీ చేయాలని సూచించాడు. మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్లో టీమిండియా వెనుకంజలో నిలిచింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 358 పరుగులే చేసింది. అనంతరం ఇంగ్లండ్ దూకుడుగా తమ తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించింది. ఓపెనర్ బాజ్ బాల్ గేమ్తో ఎదురుదాడికి దిగడంతో ఒక్క సెషన్లోనే 148 పరుగులు చేసింది.
రెండో రోజు ఆట అనంతరం శుభ్మన్ గిల్ కెప్టెన్సీపై మాట్లాడిన మైఖేల్ వాన్.. ఇలా అయితే కష్టమని చెప్పాడు. మైదానంలో దూకుడుగా నిర్ణయాలు తీసుకోవాలని సూచించాడు. మూడో రోజు ఆటలో మెరుగైన ప్రదర్శన చేస్తేనే టీమిండియా ఈ మ్యాచ్తో పాటు సిరీస్లో పుంజుకోగలదన్నాడు. 'ఈ సిరీస్ గమనాన్ని మూడో రోజు ఆట నిర్దేశించనుంది. మూడో రోజు ఆటలో ఇంగ్లండ్ మెరుగైన ప్రదర్శన చేస్తే ఈ మ్యాచ్ గెలవడంతో పాటు సిరీస్ను కైవసం చేసుకుంటుంది. ఈ మ్యాచ్లో టీమిండియా పుంజుకోవాలంటే టీమిండియా తమ మైండ్సెట్ను మార్చుకోవాలి. శుభ్మన్ గిల్ విరాట్ కోహ్లీ మైండ్ సెట్తో రావాలి. మూడో రోజును ఆటను గెలవాలనే కసితో ఆడాలి. మూడో రోజు ఆటలో భారత్ గెలిస్తే.. ఈ మ్యాచ్ సజీవంగా ఉంటుంది. ఈ మ్యాచ్ గెలిచే అవకాశాలు కూడా ఉంటాయి. అలా కాకుండా మూడో రోజు చేతులెత్తేస్తే మాత్రం మ్యాచ్తో పాటు సిరీస్ కూడా చేజారుతుంది.'అని మైఖేల్ వాన్ హెచ్చరించాడు.

ఇక రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 46 ఓవర్లలో 2 వికెట్లకు 225 పరుగులు చేసింది. ఓపెనర్లు బెన్ డకెట్(100 బంతుల్లో 13 ఫోర్లతో 94), జాక్ క్రాలీ (113 బంతుల్లో 13 ఫోర్లు, సిక్స్తో 84) తృటిలో శతకాలు చేజార్చుకున్నారు. క్రీజులో ఓలిపోప్(16 బ్యాటింగ్)తో పాటు జోరూట్(0 బ్యాటింగ్) ఉన్నాడు. భారత బౌలర్లలో అరంగేట్ర పేసర్ అన్షూల్ కంబోజ్, రవీంద్ర జడేజా చెరో వికెట్ తీసారు.
అంతకుముందు 264/4 ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా 114.1 ఓవర్లలో 358 పరుగులకు ఆలౌటైంది. రిషభ్ పంత్(75 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 54), యశస్వి జైస్వాల్(107 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్తో 58), సాయి సుదర్శన్(151 బంతుల్లో 7 ఫోర్లతో 61) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ ఐదు వికెట్లు తీయగా.. జోఫ్రా ఆర్చర్ మూడు వికెట్లు పడగొట్టాడు. క్రిస్ వోక్స్, లియామ్ డాసన్ చెరో వికెట్ తీసారు. ఇంగ్లండ్ ఇంకా 133 పరుగుల వెనుకంజలో ఉంది. మూడో రోజు తొలి సెషన్ ఆట మ్యాచ్ గమనాన్ని నిర్దేశించనుంది.