
లండన్: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ మరోసారి భారత జట్టును ఎగతాళి చేశాడు. భారత మహిళల జట్టును ప్రశంసించిన మైకేల్ వాన్.. కోహ్లీసేన పట్ల వెటకారంగా మాట్లాడాడు.కనీసం ఒక భారత జట్టు అయినా ఇంగ్లండ్ పరిస్థితుల్లో పోరాడుతోందని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఇంగ్లండ్లో భారత మహిళలు, పురుషుల జట్లు పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఏకైక టెస్టు మ్యాచ్ను అసాధారణ పోరాటంతో డ్రా చేసుకున్న మిథాలీ సేన 3 వన్డేల సిరీస్ను 2-0 చేజార్చుకుంది. వరుసగా రెండు వన్డేల్లో ఓటమి పాలైంది. తొలి వన్డేతో పోలిస్తే రెండో వన్డేలో మెరుగైన ప్రదర్శనే చేసింది. ఈ క్రమంలోనే వాన్.. మిథాలీ సేనను ప్రశంసిస్తూ కోహ్లీసేనపై సెటైర్లు పేల్చాడు.
'భారత మహిళల జట్టు ఈ రోజు అద్భుత పోరాటం చేసింది... ఇంగ్లండ్ పరిస్థితుల్లో కనీసం ఒక భారత జట్టు అయినా పోరాడటం చూస్తుంటే బాగుంది' అని సెటైరిక్గా ట్వీట్ చేశాడు. ఐసీసీ ప్రపంచ వరల్డ్ చాంపియన్షిప్ ఫైనల్లో కోహ్లీసేన ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అయితే, మహిళల జట్టు రెండో వన్డేలో 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ రెండింటినీ పోలుస్తూ వాన్.. ట్విటర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. అంతేకాకుండా కోహ్లీసేన రెండు ఇన్నింగ్సుల్లో 217, 170 మాత్రమే చేసింది. రెండో వన్డేలో మిథాలీ జట్టు 221 పరుగులు చేయడం గమనార్హం.
ఇక గతంలో అనేకసార్లు ఇదే తరహా విద్వేశాన్ని వెల్లగక్కిన మైకేల్ వాన్ను ప్రతీసారి అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఓ ఆట ఆడుకుంటూనే ఉన్నారు. తాజా ట్వీట్పై కూడా తమ దైన శైలిలో బదులిస్తున్నారు. కనీసం మా అమ్మాయిలైనా అక్కడ రాణిస్తున్నారని, కానీ ఇంగ్లండ్ టీమ్స్ ఏవీ భారత్లో రాణించడం లేదని చురకలంటిస్తున్నారు. 'ఇంగ్లండ్ గడ్డపై ఇంగ్లండ్నే ఓడించి చాంపియన్స్ ట్రోఫీ గెలుచుకున్నాం' ఆ సంగతి మరిచిపోయావా? వాన్ అంటూ మండిపడుతున్నారు.
తప్పక గెలవాల్సిన మ్యాచ్లో కెప్టెన్ మిథాలీ రాజ్(92 బంతుల్లో 7 ఫోర్లతో 59) రాణించినా.. భారత మహిళలకు ఓటమి తప్పలేదు. బుధవారం అర్దరాత్రి దాటక ముగిసిన రెండో వన్డేలో ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన ఇంగ్లండ్ మహిళలు 5 వికెట్లతో ఘన విజయం సాధించారు. ఫలితంగా మూడు వన్డేల సిరీస్లో మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో సిరీస్ కైవసం చేసుకున్నారు. ఈ మ్యాచ్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 221 పరుగులకు ఆలౌటైంది.
అనంతరం ఇంగ్లండ్ 47.3 ఓవర్లలో 5 వికెట్లకు 225 పరుగులు చేసి 15 బంతులు మిగిలుండగానే విజయాన్నందుకుంది. ఆ జట్టులో ఓపెనర్ లారెన్ విన్ఫీల్డ్ హిల్(42), లోయరార్డర్ బ్యాటర్లు సోఫియా డంక్లీ(73 నాటౌట్), కేతరిన్ బ్రంట్(33 నాటౌట్) రాణించారు. భారత బౌలర్లలో పూనమ్ యాదవ్ రెండు వికెట్లు తీయగా.. జూలన్ గోస్వామి, శిఖా పాండే, స్నేహ్ రాణా తలో వికెట్ తీశారు. భారత్ పతనాన్ని శాసించిన కేట్ క్రాస్(5/34)కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.