న్యూఢిల్లీ: టీమిండియా మాజీ ఓపెనర్, లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ గౌతమ్ గంభీర్పై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైఖేల్ వాన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కోచ్లు డగౌట్లోనే ఉండాలని, మైదానంలోకి రావాల్సిన అవసరం ఏం ఉందని విమర్శించాడు.
విరాట్ కోహ్లీతో గొడవపై స్పందించిన మైఖేల్ వాన్.. గంభీర్ తీరును తప్పుబట్టాడు. ఆటగాళ్ల మధ్య వివాదం తలెత్తితే కోచ్లు మధ్యలో దూరిపోవాల్సిన అవసరం లేదంటూ గంభీర్ తీరును తప్పుబట్టాడు. క్రిక్బజ్ షోలో మాట్లాడిన మైఖేల్ వాన్.. కోచ్ సంయమనం పాటించాలని సూచించాడు.

'మైదానంలో ఆటగాళ్లు ఒక్కోసారి గొడవ పడటం సహజం. ఆటలో భావోద్వేగాలు కూడా మిళితమై ఉంటాయి. అలా అని ప్రతీ రోజు ఇలాంటి వివాదాలు జరగవు కదా? ఏదేమైనా ఇలాంటివి జరిగినప్పుడు కోచ్లు సంయమనం పాటించాలి. కోచ్లు లేదంటే ఇతర సహాయ సిబ్బంది ఆటలో ఎందుకు జోక్యం చేసుకుంటారో నాకైతే అర్థం కావడం లేదు.
మైదానంలో జరిగింది మైదానం వరకే పరిమితం చేయాలి. అంతేగానీ గొడవ పెద్దది చేయాలని చూడకూడదు. ఒకవేళ ఇద్దరు ఆటగాళ్ల మధ్య వాగ్వాదం జరుగుతుంటే.. వాళ్లే కాసేపటి తర్వాత సర్దుకుంటారు. అంతేగానీ డగౌట్లో కూర్చోవాల్సిన కోచ్లు వెళ్లి మధ్యలో దూరిపోకూడదు. డ్రెస్సింగ్ రూమ్లో నుంచి గమనిస్తూ పరిస్థితిని గమనించి అందుకు తగ్గట్లు గొడవ చల్లారేలా చేయాలి'అని మైఖేల్ వాన్ వ్యాఖ్యానించాడు.
మ్యాచ్ అనంతరం గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ మధ్య గొడవ అయిన విషయం తెలిసిందే. ఈ గొడవపై కన్నెర్ర చేసిన బీసీసీఐ..ఇద్దరికీ మ్యాచ్ ఫీజులో 100 శాతం కోత విధించింది. తమ ఆటగాడినంటే కుటుంబాన్ని అన్నట్లేనని గంభీర్.. కోహ్లీపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.