టెస్ట్ క్రికెట్లో టీమిండియా క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ నమోదు చేసిన వరల్డ్ రికార్డ్ను ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జోరూట్ అధిగమిస్తాడని ఆ జట్టు మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ జోస్యం చెప్పాడు. సచిన్ సాధించిన అరుదైన ఘనతను అధిగమించే సత్తా జో రూట్కు మాత్రమే ఉందని స్పష్టం చేశాడు. విరాట్ కోహ్లీ, కేన్ విలియమ్సన్ రేసులో ఉన్నా.. వారికి సాధ్యం కాదని అభిప్రాయపడ్డాడు.
తన కెరీర్లో 200 టెస్ట్ మ్యాచ్లు ఆడిన సచిన్ టెండూల్కర్ 51 సెంచరీలతో 15,921 పరుగులు చేశాడు. అతనికి దరిదాపుల్లో మరే ఆటగాడు కూడా లేడు. ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్న వారిలో జోరూట్ మాత్రమే 11,940 పరుగులతో సచిన్ తర్వాత 8వ స్థానంలో కొనసాగుతున్నాడు. విరాట్ కోహ్లీ 8,848 పరుగులతో 19వ స్థానంలో ఉన్నాడు. 142 టెస్ట్ల్లో జోరూట్ 11,940 పరుగులు చేస్తే.. విరాట్ కోహ్లీ 113 టెస్ట్ల్లో 8848 పరుగులు చేశాడు.

తాజాగా వెస్టిండీస్తో ముగిసిన రెండో టెస్ట్లో జోరూట్ శతకంతో ఇంగ్లండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే జోరూట్పై ప్రశంసల జల్లు కురిపించిన మైకేల్ వాన్.. సచిన్ రికార్డ్ను అధిగమించే సత్తా విరాట్ కోహ్లీ కంటే జోరూట్కే ఉందని చెప్పాడు.

'అతి త్వరలోనే ఇంగ్లండ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన టెస్ట్ బ్యాటర్గా జోరూట్ రికార్డ్ సాధిస్తాడు. అలెస్టర్ కుక్(12472) కంటే కాస్త వెనుకంజలో ఉన్నాడు. భవిష్యత్తులో సచిన్ టెండూల్కర్ ఆల్టైమ్ రికార్డునూ కూడా అధిగమిస్తాడు. గతంలో మాదిరిగా జోరూట్ ఆచితూచి ఆడటం లేదు. బజ్బాల్ అప్రోచ్తో వేగంగా పరుగులు చేస్తున్నాడు. క్వాలిటీ క్రికెట్ ఆడుతున్నాడు.'అని మైకేల్ వాన్ కొనియాడాడు. సంప్రదాయక ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన ఈ తరం క్రికెటర్లలో జోరూట్, కోహ్లీ తర్వాత కేన్ విలియమ్సన్(8743) మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.

ఆదివారం ముగిసిన రెండో టెస్ట్లో ఇంగ్లండ్ 241 పరుగుల భారీ తేడాతో వెస్టిండీస్ను చిత్తు చేసింది. ఈ గెలుపుతో మూడు టెస్ట్ల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో కైవసం చేసుకుంది. 385 పరుగుల భారీ లక్ష్యచేధనకు దిగిన వెస్టిండీస్ 143 పరుగులకే ఆలౌటైంది. ఈ మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్ల్లో ఇంగ్లండ్ 400 ప్లస్ రన్స్ చేసింది. తాజా విజయంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్స్ టేబుల్లో ఇంగ్లండ్ ఆరో స్థానానికి చేరుకుంది. వెస్టిండీస్తో చివరి మ్యాచ్ జూలై 26 నుంచి 30 వరకు జరగనుంది.