టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ ప్రశంసల జల్లు కురిపించాడు. జస్ప్రీత్ బుమ్రానే ఆల్టైమ్ గ్రేటెస్ట్ ఫాస్ట్ బౌలరని కొనియాడాడు. బుమ్రా ముందు పాకిస్థాన్ దిగ్గజ పేసర్ వసీం అక్రమ్ కూడా తక్కువేనని అభిప్రాయపడ్డాడు. టీ20 ప్రపంచకప్ 2024లో జస్ప్రీత్ బుమ్రా సంచలన బౌలింగ్తో టీమిండియాను విజేతగా నిలబెట్టిన విషయం తెలిసిందే.
సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్లో పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు కీలక వికెట్లు తీసిన బుమ్రా.. ఈ టోర్నీ అసాంతం అద్భుత ప్రదర్శన కనబర్చాడు. 8 మ్యాచ్ల్లో 8.26 సగటు, 4.17 ఎకానమీతో 15 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు అందుకున్నాడు.

భారత విజయానంతరం ప్రముఖ క్రికెట్ వెబ్సైట్తో మాట్లాడిన మైకేల్ వాన్.. బుమ్రాను ఆకాశానికెత్తాడు. 'సౌతాఫ్రికాతో ఫైనల్లో బుమ్రా తీసిన తొలి వికెట్ అద్భుతం. స్టన్నింగ్ డెలివరీతో రీజా హెండ్రీక్స్ను క్లీన్ బౌల్డ్ చేశాడు. లెగ్ స్టంప్పై పడిన బంతి బ్యాటర్ను అయోమయానికి గురి చేసి ఆఫ్ స్టంప్ను లేపేసింది.
మార్కో జాన్సెన్ను కూడా తెలివిగా బోల్తా కొట్టించాడు. బుమ్రా బౌలింగ్లో దూకుడుగా ఆడేందుకు బ్యాటర్లు భయపడుతారు. బ్యాటర్ల అప్రోచ్ తగ్గట్లు బుమ్రా తన బౌలింగ్లో వేరియేషన్స్ మారుస్తాడు. నాకు తెలిసి వైట్ బాల్ క్రికెట్లో బుమ్రాకు మించిన బౌలర్ లేడు. బెస్ట్ సీమ్ బౌలర్గా వసీం అక్రమ్ పేరు చెబుతారు. కానీ బుమ్రా అతని కంటే గొప్ప బౌలర్.

వినూత్నమైన బౌలింగ్ యాక్షన్ బుమ్రా సొంతం. అతని బౌలింగ్లో పేస్తో పాటు వేరియేషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా తీవ్ర ఒత్తిడిలోనూ ఎలాంటి తడబాటు లేకుండా సమర్థవంతంగా బౌలింగ్ చేసే నైపుణ్యం బుమ్రా సొంతం. ప్రపంచకప్లోనే కాదు. ప్రతీ మ్యాచ్లోనూ బుమ్రా ఇదే తరహా బౌలింగ్తో సత్తా చాటుతాడు.'అని మైకేల్ వాన్ చెప్పుకొచ్చాడు.
సౌతాఫ్రికాతో శనివారం ఉత్కంఠగా సాగిన ఫైనల్లో టీమిండియా 7 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. 2013 ఛాంపియన్ ట్రోఫీ తర్వాత ఒక్క ఐసీసీ టైటిల్ గెలవని టీమిండియా.. తాజా విజయంతో ఆ నిరీక్షణకు తెరదించింది.