
లండన్: కరోనాతో నిరవధికంగా వాయిదా పడిన ఐపీఎల్ 2021 సీజన్ నిర్వహణ కోసం (భారత క్రికెట్ నియంత్రణ మండలి) బీసీసీఐ ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్యాష్ రిచ్ లీగ్లో మిగిలిపోయిన 31 మ్యాచ్ల నిర్వహణకు యూకే ఫస్ట్ చాయిస్ వేదికగా భారత క్రికెట్ బోర్డు భావిస్తోంది. ఎందుకంటే వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్, ఇంగ్లండ్తో ఐదు టెస్ట్ల సిరీస్ కోసం టీమిండియా జంబో జట్టు యూకేకు వెళ్లనుంది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకూ అక్కడే ఉండనుంది. అలాగే, ఇతర దేశాల ప్లేయర్లను ఇంగ్లండ్కు తీసుకురావడం ఈజీ అవుతోంది. మరోవైపు బ్రాడ్కాస్టర్ స్టార్స్పోర్ట్స్ కూడా ఇంగ్లండ్లో సెకండాఫ్ నిర్వహించేందుకు సానుకూలంగా ఉంది.
ఐపీఎల్ ఫేజ్-2 కోసం భారత్- ఇంగ్లండ్ మధ్య జరగబోయే ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో మార్పులు చేయడానికి కూడా బీసీసీఐ సిద్దమైందనే వార్తలు వినిపించాయి. సెప్టెంబర్ విండో కోసం భారత్- ఇంగ్లండ్ సిరీస్ షెడ్యూల్ను మార్చాలని ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డును సంప్రదించినట్లు కూడా తెలుస్తోంది. ఒక్కో టెస్టు షెడ్యూల్లో మార్పు చేసి కనీసం వారం ముందుగా సిరీస్ ముగించాలని ఇంగ్లండ్ బోర్డు (ఈసీబీ)కి విజ్ఞప్తి చేసింది. ఆగస్టు 4న మొదలయ్యే సిరీస్ సెప్టెంబర్ 14న ముగుస్తుంది. దీనిని కనీసం సెప్టెంబర్ 7 వరకు ముగించాలని బీసీసీఐ కోరుతోంది. అలా చేస్తే కనీసం మూడు వారాల సమయం తమకు దొరుకుందని... అవసరమైతే రోజుకు రెండు మ్యాచ్ల చొప్పున నిర్వహించైనా ఐపీఎల్లోని మిగిలిన 31 మ్యాచ్లను పూర్తి చేయవచ్చని భారత బోర్డు భావిస్తోంది.
అయితే ఇది సాధ్యమయ్యే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ఐదు టెస్టులకు సంబంధించి ఆయా తేదీల ప్రకారం దాదాపు అన్ని టికెట్లు ఇప్పటికే అమ్ముడుపోయాయి. పైగా హోటల్ వసతి, బయో బబుల్, టీవీ ప్రసారపు ఏర్పాట్లు కొత్తగా చేయాల్సి రావడంతో పాటు ఈసీబీ తమ కౌంటీ జట్లను కూడా ఒప్పించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇంగ్లండ్ ప్రతిష్టాత్మక టోర్నీ ది హండ్రెడ్ అరంగేట్ర సీజన్ జూలై 21 నుంచి ఆగస్టు 21 వరకు జరగనుంది. టెస్ట్ సిరీస్ ఇంకా ముందుకు జరిపితే ఈ లీగ్ నిర్వహణపై ప్రభావం చూపనుంది. అయితే బీసీసీఐ ఈ గందరగోళం నుంచి బయటపడి ఐపీఎల్ సెకండాఫ్ పూర్తి చేయాలంటే తానిచ్చే సింపుల్ సొల్యూషన్ను ఫాలో కావాలని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ సూచించాడు.
భారత్-ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ను ఓ వారం ముందుకు జరపాలని, దాంతో ది హండ్రెడ్ లీగ్కు దూరమయ్యే ఇంగ్లండ్ ఆటగాళ్ల ప్లేస్లో టెస్ట్ మ్యాచ్లు ఆడని భారత ఆటగాళ్లను ఆడేందుకు బీసీసీఐ అనుమతించాలని ట్వీట్ చేశాడు. ఇది ఇరు బోర్డులకు లాభం చేకూర్చే విషయమన్నాడు. 'ఐపీఎల్ 2021 సెకండాఫ్ నిర్వహణకు చాలా సింపుల్ సొల్యూషన్. ముందుగా భారత్-ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ను ఓ వారం ముందుకు జరపాలి. ఈ సిరీస్ కారణంగా ది హండ్రెడ్ లీగ్కు దూరమయ్యే ఇంగ్లండ్ ఆటగాళ్ల ప్లేస్ల్లో టెస్ట్ మ్యాచ్లు ఆడని భారత ఆటగాళ్లను బరిలోకి దించాలి. అప్పుడు ఐపీఎల్ను పూర్తి చేయవచ్చు. ఇరు బోర్డులకు ఇది మంచి డీల్'అని పేర్కొన్నాడు.