
హైదరాబాద్: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ మరోసారి భారత జట్టుపై తన అక్కసు వెళ్లగక్కగా.. అభిమానులు తమదైన శైలిలో బదులిస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టీవ్గా ఉంటూ.. ప్రతీ చిన్న విషయంపై స్పందించే మైఖేల్ వాన్.. ఇంగ్లండ్ క్లీన్ స్వీప్పై మాత్రం నోరెత్తలేదు. గప్చుప్గా ఉండిపోయాడు. అవకాశం దొరికినప్పుడల్లా టీమిండియాను విమర్శించే వాన్.. సొంత జట్టు బంగ్లాదేశ్ చేతిలో ఘోరంగా ఓడినప్పుడు మౌనంగా ఉండటాన్ని భారత అభిమానులు జీర్ణించుకోలేకపోయారు.
ముందుగా టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్.. మైఖేల్ వాన్ ఎక్కడా..? కనబడక చాలా రోజులవుతుందని సెటైర్లు పేల్చాడు. దాంతో భారత అభిమానులు కూడా వరల్డ్ ఛాంపియన్ బంగ్లాదేశ్ చేతిలో చిత్తయ్యిందని దీని గురించి ట్వీట్ చేయాలని మైఖేల్ వాన్ను కోరారు.
ఈ కామెంట్తో చిర్రెత్తుకుపోయిన వాన్ ఘాటుగా బదులిచ్చాడు. 'ఇంగ్లండ్ ఓడినా.. ఇప్పటికీ వరల్డ్ చాంపియనే. వరుస ప్రపంచకప్లతో ఇంగ్లండ్ అగ్రస్థానంలో దూసుకెళ్తోంది. ఇది మంచి లక్షణం. భారత్ కూడా ఇంగ్లండ్ను అనుసరించాలి'అని ట్వీట్ చేశాడు. ఇక బంగ్లాదేశ్ చేతిలో ఓడినా మేం వరల్డ్ చాంపియన్స్మే అంటూ వసీం జాఫర్కు బదులిచ్చాడు. గుడ్ మార్నింగ్ జాఫర్ అంటూ ఇంగ్లండ్ గెలిచిన టీ20 ప్రపంచకప్ ఫొటోను షేర్ చేశాడు.
ఇక ఇంగ్లండ్ను భారత్ అనుసరించాలనే కామెంట్పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత్ ఇప్పటికే రెండు వన్డే ప్రపంచకప్లతో పాటు ఓ టీ20 ప్రపంచకప్ కూడా గెలిచిందని, ఇంగ్లండ్ తరహాలో బౌండరీల కౌంట్ అనే చెత్త నిబంధనతో గెలవలేదని బదులిస్తున్నారు. క్రికెట్ను కనుగొన్న ఇంగ్లండ్కే ప్రపంచకప్ గెలవడానికి ఇన్నేళ్లు పట్టిందని విమర్శిస్తున్నారు.
ఇక మంగళవారం జరిగిన చివరి టీ20లోనూ ఇంగ్లండ్ 16 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 158 పరుగులు చేసింది. ఓపెనర్ లిటన్ దాస్(57 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్తో 73) హాఫ్ సెంచరీతో రాణించగా.. నజ్ముల్ హొస్సెన్ షాంటో(36 బంతుల్లో ఫోర్, 2 సిక్స్లతో 47 నాటౌట్) విలువైన పరుగులు చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్, ఆదిల్ రషీద్ తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 142 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. డేవిడ్ మలాన్(47 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 53) హాఫ్ సెంచరీతో రాణించినా ఫలితం లేకపోయింది. కెప్టెన్ జోస్ బట్లర్(31 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 40) విజయం కోసం పోరాడాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో టస్కిన్ అహ్మద్ రెండు వికెట్లు తీయగా.. తన్వీర్ ఇస్లామ్, షకీబ్ అల్ హసన్, ముస్తాఫిజుర్ రెహ్మాన్ తలో వికెట్ పడగొట్టారు.