భారత క్రికెట్ జట్టుపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ మరోసారి నోరు పారేసుకున్నాడు. ఐసీసీ టోర్నీల్లో గత పదేళ్లుగా టీమిండియా విజేతగా నిలవలేకపోయిందన్నాడు. ప్రతిభ, వనరులకు కొదువ లేకున్నా టీమిండియా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయిందని విమర్శించాడు. ఆస్ట్రేలియా-పాకిస్థాన్ మధ్య జరిగిన రెండో టెస్ట్ సందర్భంగా మైకేల్ వాన్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
'గత పదేళ్లుగా టీమిండియా పెద్దగా సాధించిందేమీ లేదు. ఆ జట్టు వల్ల ఏది కాదని నేను భావిస్తున్నా. వారు ఏ టోర్నీ కూడా గెలవలేరు. టీమిండియా చివరగా ఎప్పుడు గెలిచింది? వారి వద్ద ఉన్న ప్రతిభతో వారు ఎన్నో విజయాలు అందుకోవాలి. కానీ అలా జరగలేదు. ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా రెండు సార్లు టెస్టు సిరీస్ గెలిచింది.

2018-19, 2020-2021లో ఆసీస్ను వారి గడ్డపై ఓడించింది. కానీ ఐసీసీ టోర్నీల్లో మాత్రం విజేతగా నిలవలేకపోయింది. వన్డే ప్రపంచకప్, టీ20 ప్రపంచకప్, డబ్ల్యూటీసీ టోర్నీల్లో వారు విజేతగా నిలవలేకపోయారు. వారి వల్ల ఏది కాదు. భవిష్యత్తులో కూడా వారు ఐసీసీ టోర్నీలు గెలుస్తారని నేను అనుకోవడం లేదు'అని మైకెల్ వాన్ చెప్పుకొచ్చాడు.
ఇక టీమిండియా మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో చివరగా 2013లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్క ఐసీసీ టైటిల్ కూడా గెలవలేకపోయింది. 2015, 2019 వన్డే ప్రపంచకప్లో సెమీ ఫైనల్కే పరిమితమైన టీమిండియా.. 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఓటమిపాలైంది.
టీ20 ప్రపంచకప్ల్లోనూ నాకౌట్ మ్యాచ్లకే పరిమితమైంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్లో భాగంగా రెండు ఫైనల్ మ్యాచుల్లో కూడా ఓడి రన్నరప్గా నిలిచింది. ఈ నేపథ్యంలోనే మైకేల్ వాన్.. టీమిండియాను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశాడు. వరల్డ్ రిచెస్ట్ బోర్డు అయిన బీసీసీఐ.. తమ జట్టును మాత్రం ఛాంపియన్గా నిలబట్టలేకపోతుందని హేళన చేశాడు.
ప్రస్తుతం సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న టీమిండియా.. తొలి టెస్టులో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. జనవరి 3 నుంచి రెండో టెస్టు ప్రారంభం కానుండగా.. ఈ సిరీస్ తర్వాత టీమిండియా స్వదేశంలో అఫ్గానిస్థాన్, ఇంగ్లండ్తో ద్వైపాక్షిక సిరీస్లు ఆడుతోంది. అఫ్ఘానిస్థాన్తో మూడు మ్యాచుల టీ20 సిరీస్లో ఆడనున్న టీమిండియా... ఆ తర్వాత ఇంగ్లండ్తో 5 టెస్టుల సిరీస్లో తలపడనుంది.