ఇంగ్లండ్తో నాలుగో టెస్ట్లో తీవ్రంగా గాయపడిన రిషభ్ పంత్ స్థానంలో మరో బ్యాటర్ను అనుమతించేలా ఐసీసీ రూల్స్ను మార్చాలని మాజీ క్రికెటర్ మైఖేల్ వాన్ డిమాండ్ చేశాడు. ఓ ఆటగాడు తీవ్ర గాయంతో తప్పుకున్న తర్వాత 10 మంది ఆటగాళ్లతోనే మ్యాచ్ను కొనసాగించడం అన్యాయమని అభిప్రాయపడ్డాడు. మాంచెస్టర్ వేదికగా బుధవారం ప్రారంభమైన నాలుగో టెస్ట్లో రిషభ్ పంత్ రివర్స్ స్వీప్ షాట్ ఆడబోయి తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే.
క్రిస్ వోక్స్ బౌలింగ్లో రిషభ్ పంత్ రివర్స్ స్వీప్ ఆడే ప్రయత్నం చేయగా.. బంతి నేరుగా అతని కుడి పాదానికి బలంగా తాకింది. దాంతో తీవ్ర గాయమై రక్త స్రావమైంది. ఈ గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో పంత్ తన కాలిని నేలపై పెట్టలేకపోయాడు. దాంతో అతన్ని గోల్ఫ్ కార్ట్ అంబులెన్స్ ద్వారా బయటకు తీసుకెళ్లారు. రిషభ్ పంత్ కుడి కాలి చివరి వేలికి ఫ్రాక్ఛర్ అయినట్లు తెలుస్తోంది. అతను ఈ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడని వార్తలు వస్తున్నాయి. బీసీసీఐ మాత్రం రిషభ్ పంత్ గాయంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. రిషభ్ పంత్ స్థానంలో ధ్రువ్ జురెల్ వికెట్ కీపింగ్ చేసే అవకాశం ఉన్నా.. అతను బ్యాటింగ్ చేయలేడు.దాంతో టీమిండియా 10 మందితోనే బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. కంకషన్ గాయానికి మాత్రమే ప్లేయర్ టూ ప్లేయర్ రిప్లేస్మెంట్కు అవకాశం ఉంటుంది.

పంత్ గాయంపై స్పందించిన మైఖేల్ వాన్.. కంకషన్ సబ్స్టిట్యూట్ తరహాలోనే ఇంజ్యూరీ రిప్లేస్మెంట్కు కూడా అవకాశం కల్పించేలా రూల్స్ మార్చాలని మైఖేల్ వాన్ డిమాండ్ చేశాడు. 'ఈ మ్యాచ్లో ఇంకా నాలుగు రోజుల ఆట మిగిలి ఉంది. ఇదొక అద్భుతమైన సిరీస్. ఇప్పటి వరకు ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. కానీ పంత్ గాయం కారణంగా ఇరు జట్ల పోరు 10 మంది ఆటగాళ్లు వర్సెస్ 11 మంది ఆటగాళ్లుగా మారింది. ఇది అన్యాయం. రిషభ్ పంత్ స్థానంలో మరో బ్యాటర్ను సబ్స్టిట్యూట్గా అనుమతించాలి.
కంకషన్ సబ్స్టిట్యూట్ తరహాలోనే ఇంజ్యూరీ రిప్లేస్మెంట్కు అవకాశం ఇవ్వాలి. ఇది నా డిమాండ్. ఒకవేళ రెండో ఇన్నింగ్స్లో ఇలా జరిగితే.. జట్లు రూల్స్ను ఉల్లంఘించే అవకాశం ఉంటుంది. దురుద్దేశపూర్వకంగా ఇంజ్యూరీ రిప్లేస్మెంట్ తీసుకోవచ్చు. కానీ ఆటగాళ్లకు చేతి విరగడం, కాలు విరగడం వంటి పెద్ద గాయాలు అయినప్పుడు స్పష్టంగా తెలుస్తోంది. అప్పుడు సబ్స్టిట్యూట్ ఆటగాడిని అనుమతించాలి.'అని మైఖేల్ వాన్ డిమాండ్ చేశాడు. రిషభ్ పంత్ గాయం నేపథ్యంలో మైఖేల్ వాన్ చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఆటగాళ్ల భద్రత, మ్యాచ్ సమతుల్యత దృష్ట్యా టెస్ట్ క్రికెట్లో సబ్స్టిట్యూట్ రూల్స్ మార్చాల్సిన అవసరం ఉందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అయితే ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ మాత్రం ఈ డిమాండ్ను తప్పుబట్టాడు. చిన్న గాయానికే రిప్లేస్మెంట్ కోరే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డాడు. 'అది చిన్న గాయమే అయితే పరిస్థితి ఏంటి? ఇంజ్యూరీ రిప్లేస్మెంట్కు నేను అంగీకరిస్తానా? లేదా? అనేది స్పష్టంగా చెప్పలేను. కానీ ఈ రూల్ను ఆయా జట్లు మిస్ యూస్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పంత్ తీవ్రమైన నొప్పితో మైదానం వీడాడు. అతనికి ఫ్రాక్చర్ కాకపోతే.. సబ్స్టిట్యూబ్ బ్యాటర్ను ఆడించాలా? చిన్న గాయాలకు కూడా ఈ రూల్ను వాడుకునే అవకాశం ఉంటుంది.'అని అలిస్టర్ కుక్ చెప్పుకొచ్చాడు.