టీ20 ప్రపంచకప్ 2024లో సంచలన ప్రదర్శనతో తొలిసారి సెమీఫైనల్కు అర్హత సాధించిన అఫ్గానిస్థాన్.. కీలక పోరులో దారుణంగా విఫలమైంది. సౌతాఫ్రికాతో గురువారం ఉదయం ట్రినిడాడ్ వేదికగా జరిగిన తొలి సెమీఫైనల్లో 9 వికెట్ల తేడాతో చిత్తయ్యింది. బ్యాటింగ్కు ప్రతికూలంగా ఉన్న ఈ వికెట్పై అఫ్గానిస్థాన్ 56 పరుగులకే కుప్పకూలింది.
అనంతరం సౌతాఫ్రికా 8.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 60 పరుగులు చేసి 67 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. దాంతో టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే సెమీఫైనల్లో ఘోర పరాజయం ఎదుర్కొన్న జట్టుగా అప్రతిష్టను మూటగట్టుకుంది. అయితే అఫ్గానిస్థాన్ ఘోర పరాజయానికి టీమిండియానే ప్రధాన కారణమని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ ఆరోపించాడు.

టీమిండియాకు ఐసీసీ ఇచ్చిన అధిక ప్రాధాన్యతోనే అఫ్గానిస్థాన్ జట్టుకు అన్యాయం జరిగిందన్నాడు. టీమిండియాకు అనుకూలంగా ఉండే షెడ్యూల్ రూపొందించడంతో అఫ్గానిస్థాన్ ఆటగాళ్లకు సెమీఫైనల్కు కావాల్సిన ప్రాక్టీస్ లభించలేదన్నాడు.
'సోమవారం రాత్రి సెయింట్ విన్సెంట్ వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో విజయం సాధించిన అఫ్గానిస్థాన్ జట్టు.. టీమిండియాకు అనుకూలంగా ముందే నిర్ణయించిన షెడ్యూల్ కారణంగా ట్రినిడాడ్ వెళ్లాల్సి వచ్చింది. దురదృష్టవశాత్తు వారి ట్రినిడాడ్ విమానం నాలుగు గంటలు ఆలస్యమైంది. దాంతో అఫ్గాన్ ఆటగాళ్లకు సరైన విశ్రాంతి లేకపోవడంతో పాటు ప్రాక్టీస్కు సమయం లేకుండా పోయింది. ఇది అత్యంత దారుణమైన విషయం.'అని మైకేల్ వాన్ ట్వీట్ చేశాడు.
అంతేకాకుండా ఈ టోర్నీలో టీమిండియా ఒక్క మ్యాచ్ కూడా సాయంత్ర వేళ ఆడలేదన్నాడు. భారత ప్రేక్షకులకు అనుకూలంగా ఉండే విధంగా ఓ సెమీఫైనల్ మ్యాచ్ను ముందుగానే గయానా వేదికగా షెడ్యూల్ చేశారన్నాడు. దాంతో ఇతర జట్లకు అన్యాయం జరిగిందని మైకేల్ వాన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
మైకేల్ వాన్తో పాటు మార్క్ బట్చర్, ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ కూడా ఐసీసీ తీరును తప్పుబట్టారు. టీమిండియా టీవీ ప్రేక్షకుల కోసం ఐసీసీ ఇలా ముందే షెడ్యూల్ ఖారరు చేసిందని బట్చర్ అసహనం వ్యక్తం చేశాడు. దాంతోనే ఏ ఒక్క కామెంటేటర్ కూడా ఈ టోర్నీ జరిగే తీరు గురించి మాట్లాడటం లేదని, వాళ్లంతా ఐసీసీ బానిసల్లా తయారయ్యారని ఘాటుగా విమర్శించాడు.