
చెన్నై: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్పై తీవ్ర చర్చ జరుగుతున్న వేళ చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ ఈ ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ ధోనీ రిటైర్మెంట్ వ్యవహారంపై స్పందించాడు. ధోనీలో ఇంకా క్రికెట్ ఆడే సత్తా ఉందని, అతనికి అంతర్జాతీయ క్రికెట్ ఆడాలని ఉంటే మహీకి ఖచ్చితంగా భవిష్యత్తు ఉంటుందన్నాడు.
'ఎంఎస్ ధోనీ ఆటపట్ల అంకితభావం ఉన్న ఆటగాడు. ఒక టోర్నమెంట్కు మానసికంగా, శారీరకంగా ఎలా సిద్ధమవ్వాలో, దానికి ఏం కావాలో అతనికి బాగా తెలుసు. ఐపీఎల్లో రాణించేందుకు అతను చాలా కష్టపడ్డాడు. మునపటి ఫామ్ అందుకోవడానికి అతనికి ఎక్కువ సమయం పట్టదని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఒకవేళ అతను ఇంకా అంతర్జాతీయ క్రికెట్ ఆడాలనుకుంటే.. సెలెక్టర్లు కూడా ధోనీని కావాలనుకుంటే భారత జట్టులోకి పునరాగమనం చేస్తాడు.'అని ఈ చెన్నై బ్యాటింగ్ కోచ్ చెప్పుకొచ్చాడు.
వన్డే ప్రపంచకప్ అనంతరం సుమారు 10 నెలలు ఆటకు దూరమైన మహీ.. కొంతకాలం సైన్యంలో పనిచేశాడు. అనంతరం సొంత పనులకే పరిమితమయ్యాడు.
ఈ మధ్యలో ఎలాంటి క్రికెట్ ఆడకపోవడంతో బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టును కోల్పోయాడు. దీంతో అతని రిటైర్మెంట్పై అప్పుడే ఊహాగానాలు వినిపించాయి. అయితే భారత హెడ్ కోచ్ రవిశాస్త్రి.. ధోనీ భవితవ్యంపై ఐపీఎల్తో తేలుందని అప్పట్లో వ్యాఖ్యానించాడు.
ఇక ధోనీ ఐపీఎల్ 2020 సీజన్ కోసం తీవ్రంగా సాధన చేశాడు. లాక్డౌన్ ముందు చెన్నై సూపర్ కింగ్స్ నిర్వహించిన ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నాడు. కానీ కరోనా కారణంగా ఐపీఎల్ సీజన్ నిరవధికంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. దీంతో ధోనీ భవితవ్యంపై మళ్లీ చర్చ మొదలైంది. హర్భజన్ సింగ్, ఆశిష్ నెహ్రా వంటి ఆటగాళ్లు అయితే ధోనీ మరోసారి బ్లూ జెర్సీ ధరిస్తాడని తాము అనుకోవడం లేదంటున్నారు. మరోవైపు చెన్నై ఆటగాళ్లు మాత్రం.. ధోనీలో రీ ఎంట్రీ ఇవ్వాలనే కసి కనిపించిందన్నారు.