ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్.. భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా పోరులో బరిలోకి దిగిన ఆటగాళ్లతో ఆల్టైమ్ ఎలెవన్ ప్రకటించాడు. ఇరు జట్ల మధ్య ప్రస్తుతం జరుగుతున్న ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో.. ఇరు జట్లలోనే బెస్ట్ ప్లేయర్లతో అత్యుత్తమ జట్టును ఎంపిక చేశాడు.
అయితే ఈ జట్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు దిగ్గజ స్పిన్నర్లు అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్తో పాటు స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్కు చోటు దక్కలేదు.

ఓపెనర్లుగా మాజీ డాషింగ్ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్తో పాటు ఆస్ట్రేలియా లెజెండరీ ఓపెనర్ మాథ్యూ హెడెన్ను క్లార్క్ ఎంపిక చేశాడు. మూడో స్థానంలో ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ను తీసుకున్న క్లార్క్.. నాలుగు, ఐదు స్థానాల్లో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్తో పాటు వరల్డ్ బెస్ట్ బ్యాటర్ విరాట్ కోహ్లీని ఎంచుకున్నాడు.
వికెట్ కీపర్గా ఆడమ్ గిల్ క్రిస్ట్, మహేంద్ర సింగ్ ధోనీలను ఎంపిక చేసాడు. భారత్ కండిషన్స్కు ధోనీ.. ఆసీస్ పరిస్థితులకు ఆడమ్ గిల్ క్రిస్ట్ అని వివరణ ఇచ్చాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్గా దివంగత ఆసీస్ ప్లేయర్ షేన్ వార్న్ను క్లార్క్ తీసుకున్నాడు. పేసర్లుగా ర్యాన్ హర్రీస్తో పాటు జస్ప్రీత్ బుమ్రా, మెక్గ్రాత్లను ఎంచుకున్నాడు. 12వ ఆటగాడిగా మిచెల్ జాన్సన్, జహీర్ ఖాన్లకు చోటిచ్చాడు.
మైకేల్ క్కార్క్ ఎంపిక చేసిన ఈ జట్టు సోషల్ మీడియా వేదికగా చర్చనీయాంశమైంది. ఆస్ట్రేలియాతో రోహిత్ శర్మ ఎక్కువగా ఆడకపోవడంతో పాటు ఓపెనింగ్ స్లాట్ ఖాళీగా లేకపోవడంతోనే అతనికి చోటు దక్కలేదనే విషయం అర్థమవుతోంది.

ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు టెస్ట్ల సిరీస్లో ఇరు జట్లు చెరో విజయం సాధించి 1-1తో సమంగా నిలిచాయి. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్లో టీమిండియా 295 పరుగుల భారీ తేడాతో గెలిస్తే.. అడిలైడ్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్ట్ను ఆసీస్ 10 వికెట్ల తేడాతో గెలిచి బదులు తీర్చుకుంది. ఇరు జట్ల మధ్య మూడో టెస్ట్ శనివారం నుంచి ప్రారంభం కానుంది.
వ్యక్తిగత కారణాలతో తొలి టెస్ట్కు దూరమైన రోహిత్ శర్మ.. రెండో టెస్ట్తో రీఎంట్రీ ఇచ్చాడు. కేఎల్ రాహుల్ కోసం తన ఓపెనింగ్ స్లాట్ను త్యాగం చేసిన రోహిత్ శర్మ.. తీవ్రంగా నిరాశపరిచాడు. రెండు ఇన్నింగ్స్ల్లో సింగిల్ డిజిట్కే పరిమితమయ్యాడు.