బలాలను నమ్ముకొని సమష్టిగా రాణించడమే తమ విజయ రహస్యమని న్యూజిలాండ్ వన్డే కెప్టెన్ మైఖేల్ బ్రెస్వెల్ అన్నాడు. ద్వితీయ శ్రేణి జట్టుతో భారత గడ్డపై తొలి వన్డే సిరీస్ గెలవడం సంతోషంగా ఉందని చెప్పాడు. భారత్తో మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఆదివారం ఇండోర్ వేదికగా జరిగిన ఆఖరి మ్యాచ్లో సమష్టిగా రాణించిన న్యూజిలాండ్ 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్ను 2-1తో కైవసం చేసుకుంది. వన్డే క్రికెట్ చరిత్రలోనే భారత గడ్డపై న్యూజిలాండ్ సిరీస్ గెలవడం ఇదే తొలిసారి.
1988లో తొలిసారి వన్డే సిరీస్ కోసం భారత పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్.. గత 38 ఏళ్లలో ఏడు ప్రయత్నాల్లో దక్కని విజయాన్ని 8వ ప్రయత్నంలో సాధించింది. ఈ విజయానంతరం మాట్లాడిన బ్రేస్వెల్.. జట్టు ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేశాడు.

'భారత్కు వచ్చి ఆడటం ఎప్పుడూ ఒత్తిడితో కూడుకున్న విషయమే. న్యూజిలాండ్ జట్టు భారత గడ్డపై వన్డే సిరీస్ గెలుచుకోవడం ఇదే తొలిసారి. ఇది చాలా ప్రత్యేకం. భారత్కు వచ్చి మంచి క్రికెట్ ఆడాలని ఏ జట్టు అయినా కోరుకుంటుంది. ఒక జట్టుగా మేం మా బలాలను నమ్ముకొని, సమష్టిగా రాణించేందుకు ప్రయత్నించాం. మాది ప్రపంచంలోనే ఒక మూలన ఉన్న అతి చిన్న దేశం. కానీ పెద్ద జట్లతో పోటీ పడుతాం.
డారిల్ మిచెల్ గత కొన్నేళ్లుగా వన్డేలో నిలకడగా రాణిస్తున్నాడు. అతను గొప్ప వ్యక్తి. తన కష్టానికి తగిన ఫలితాన్ని పొందడం సంతోషంగా ఉంది. ఈ సిరీస్లో మా జట్టు తరఫున ముగ్గురు ఆటగాళ్లు అరంగేట్రం చేయడం, కిక్కిరిసిన ప్రేక్షకుల మధ్య అనుభవాన్ని గడించడం సంతోషంగా ఉంది. న్యూజిలాండ్ క్రికెట్ డెప్త్ను పెంచడం అద్భుతమైన విషయం.'అని మైఖేల్ బ్రేస్ వెల్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 337 పరుగులు చేసింది. డారిల్ మిచెల్(131 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్స్లతో 137), గ్లేన్ ఫిలిప్స్(88 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్లతో 106) శతకాలతో రాణించారు. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్(3/63), హర్షిత్ రాణా(3/84) మూడేసి వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్(1/43), కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ పడగొట్టారు.
అనంతరం భారత్ 46 ఓవర్లలో 296 పరుగులకు కుప్పకూలింది. విరాట్ కోహ్లీ(108 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్లతో 124) శతకానికి తోడుగా నితీష్ కుమార్ రెడ్డి(57 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 53), హర్షిత్ రాణా(43 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్లతో 52) హాఫ్ సెంచరీలతో రాణించినా ఫలితం లేకపోయింది. న్యూజిలాండ్ బౌలర్లలో జాక్ ఫోక్స్(3/77), క్రిస్టియన్ క్లార్క్(3/54) మూడేసి వికెట్లు తీయగా.. జైడెన్ లెన్నాక్స్(2/42) రెండు వికెట్లు పడగొట్టాడు. కైల్ జెమీసన్కు ఒక వికెట్ దక్కింది. న్యూజిలాండ్ విజయంలో కీలక పాత్ర పోషించిన డారిల్ మిచెల్కు ప్లేయర్ ఆఫ్ ది టోర్నీతో పాటు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది.