
లండన్: ఈ ఏడాది చివర్లో భారత్ వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్లో టీమిండియా ఫేవరెట్ టీమ్ అని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ అథర్టన్ అభిప్రాయపడ్డాడు. భారత జట్టులో నైపుణ్యమైన ఆటగాళ్లకు కొదవలేదని, అలాగే స్వదేశంలో ఆడుతుండడం కూడా కోహ్లీసేనకు కలిసివస్తోందని చెప్పాడు. తాజాగా ఇంగ్లండ్తో జరిగిన టీ20 సిరీస్లో భారత్ జట్టు అద్భుత ప్రదర్శన కనబర్చి సిరీస్ను కైవసం చేసుకుందని కొనియాడాడు. వెనుకంజలో నిలిచినా.. పుంజుకొని 5 టీ20ల సిరీస్ను కైవసం చేసుకోవడం అద్భుతమన్నాడు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఈ ఇంగ్లండ్ మాజీ కెప్టెన్.. కోహ్లీసేనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
'టీ20 ప్రపంచకప్లో టీమిండియానే హాట్ ఫేవరేట్. ఐపీఎల్ వల్ల భారత జట్టుకు బలమైన బ్యాటింగ్ లైనప్ దొరికింది. అంతకు మించి నంబర్ వన్ జట్టు అయిన ఇంగ్లండ్ జట్టును ఓడించింది. అది కూడా జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, రవీంద్ర జడేజా వంటి కీలక ఆటగాళ్లు లేకుండానే అద్భుత విజయాన్నందుకుంది. ఇవే కాకుండా పొట్టి ప్రపంచకప్ స్వదేశంలో జరుగుతుండటం భారత్కు సానుకూలాంశం. ఇన్ని అనుకూలతల మధ్య భారతే ఫేవరెట్గా కనిపిస్తోంది. అయితే.. ఇంగ్లండ్, వెస్టిండీస్ వంటి జట్లు కూడా ప్రమాదకరమైనవే. వాటిని ఓడిస్తే.. టీమిండియాకు తిరుగుండదు' అని అథర్టన్ పేర్కొన్నాడు.
ఇంగ్లండ్ మరో మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ సైతం మెగా టోర్నీలో టీమిండియానే హాట్ ఫేవరేట్ అన్నాడు. ఇంగ్లండ్పై సాధించిన విజయాన్ని కొనియాడుతూ ట్వీట్ చేశాడు. ప్రస్తుత జట్టుకు జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజాను జత చేస్తే టీ20 ప్రపంచకప్లో కోహ్లీసేనకు తిరుగుండదన్నాడు.'ఈ ఐదు టీ20ల సిరీస్లో భారత్ పరిస్థితులను అద్భుతంగా అందిపుచ్చుకుంది. బెటర్ టీమ్కు విజయం దక్కింది. భారత జట్టుకు బుమ్రా, జడేజాలను జత చేస్తే.. టీ20 ప్రపంచకప్లో ఆ జట్టే ఫేవరేట్. ఈ సిరీస్ అద్యాంతం ఆసక్తికరంగా సాగింది'అని వాన్ ట్వీట్ చేశాడు.
ఇక గత శనివారం జరిగిన ఆఖరి టీ20లో భారత్ 36 పరుగులతో గెలుపొంది 5 టీ20ల సిరీస్ను 3-2తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే టెస్ట్ సిరీస్ను నెగ్గిన భారత్.. మంగళవారం(మార్చి 23) నుంచి మూడు వన్డేల సిరీస్కు సమాయత్తం అవుతోంది. ఈ నేపథ్యంలో వన్డే సిరీస్ను కూడా కైవసం చేసుకోవాలని భావిస్తోంది.