ఐపీఎల్ 2024 సీజన్లో ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు విజయం సాధించింది. సన్రైజర్స్ హైదరాబాద్తో సోమవారం జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. సూర్యకుమార్ యాదవ్(51 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్స్లతో 102 నాటౌట్) విధ్వంసకర శతకంతో ముంబైని గెలిపించాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 173 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్(30 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 48), ప్యాట్ కమిన్స్(17 బంతుల్లో 2 ఫోర్లు, 2సిక్స్లతో 35 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడగా.. ముంబై ఇండియన్స్ బౌలర్లలో హార్దిక్ పాండ్యా, పియూష్ చావ్లా మూడేసి వికెట్లు తీయగా.. బుమ్రా, అన్షుల్ కంబోజ్ తలో వికెట్ తీసారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన ముంబై ఇండియన్స్ 17.2 ఓవర్లలో 3 వికెట్లకు 174 పరుగులు చేసి గెలుపొందింది. సూర్యకు తోడుగా తిలక్ వర్మ(32 బంతుల్లో 6 ఫోర్లతో 37 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇద్దరూ నాలుగో వికెట్కు అజేయంగా 143 పరుగులు జోడించారు. సన్రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, మార్కో జాన్సెన్, ప్యాట్ కమిన్స్ తలో వికెట్ తీసారు.
ఈ ఓటమితో సన్రైజర్స్ హైదరాబాద్ తమ ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. చివరి మూడు మ్యాచ్ల్లో ఆ జట్టు రెండు గెలవాల్సిన పరిస్థితి నెలకొంది.

రోహిత్ విఫలం..
174 పరుగుల లక్ష్యచేధనకు దిగిన ముంబై ఇండియన్స్కు ఆశించిన ఆరంభం దక్కలేదు. ఓపెనర్లు ఇషాన్ కిషన్(9), రోహిత్ శర్మ(4) మరోసారి తీవ్రంగా నిరాశపరిచారు. మార్కో జాన్సెన్ వేసిన రెండో ఓవర్లో ఇషాన్ కిషన్ క్యాచ్ ఔటవ్వగా.. కమిన్స్ వేసిన నాలుగో ఓవర్లో రోహిత్ శర్మ చెత్త షాట్తో కీపర్ క్యాచ్గా వెనుదిరిగాడు.
క్రీజులోకి వచ్చిన నమన్ ధీర్(0)ను భువనేశ్వర్ కుమార్ డకౌట్ చేశాడు. దాంతో ముంబై ఇండియన్స్ 31 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ ఆచితూచి ఆడుతూ జట్టును ఆదుకున్నారు. క్రీజులో సెట్ అయ్యేందుకు టైమ్ తీసుకున్న ఈ జోడీ.. బంతి పాత బడిన తర్వాత దూకుడుగా ఆడింది.

సూర్య సూపర్ బ్యాటింగ్..
ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్ 30 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్లో తిలక్ వర్మ ఆచితూచి ఆడుతూ యాంకర్ రోల్ పోషించాడు. హాఫ్ సెంచరీ అనంతరం మరింత దూకుడుగా ఆడిన సూర్యకుమార్ యాదవ్.. స్కోర్ బోర్డును పరుగెత్తించాడు. విపరీతమైన డ్యూ రావడంతో బౌలర్లకు బౌలింగ్ చేయడం ఇబ్బందిగా మారింది.
ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న ముంబై బ్యాటర్లు దూకుడు కనబర్చారు. కమిన్స్ బౌలింగ్లో వరుసగా 4, 4, 6 బాదిన సూర్య.. నటరాజన్ వేసిన 18వ ఓవర్లో సిక్స్ బాది 51 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకోవడంతో పాటు ముంబై ఇండియన్స్ విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.