ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక మ్యాచ్లకు సారథ్యం వహించిన ఆటగాళ్ల జాబితాలో భారత దిగ్గజ క్రికెటర్ సౌరవ్ గంగూలీని అధిగమించాడు. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్తో సోమవారం జరిగిన మ్యాచ్తో హార్దిక్ పాండ్యా ఈ ఫీట్ సాధించాడు.
ఐపీఎల్లో కెప్టెన్గా హార్దిక్ పాండ్యాకు ఇది 43వ మ్యాచ్. ఇక సౌరవ్ గంగూలీ 2008 నుంచి 2012 వరకు కోల్కతా నైట్రైడర్స్, పుణేవారియర్స్ జట్లకు సారథ్యం వహించాడు. సారథిగా దాదా 42 ఐపీఎల్ మ్యాచ్లు ఆడాడు.

ఇక ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలం ముంగిట హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ వదిలేయగా.. అతను కొత్త టీమ్ అయిన గుజరాత్ టైటాన్స్కు సారథ్యం వహించాడు. తమ ఫస్ట్ సీజన్లోనే గుజరాత్ టైటాన్స్ సారథిగా ఆ జట్టుకు టైటిల్ అందించడంతో పాటు గతేడాది రన్నరప్గా నిలిపాడు.
ఈ సీజన్ ముంగిటనే క్యాష్ ట్రేడింగ్ ద్వారా ముంబై ఇండియన్స్లోకి వచ్చి సారథ్య బాధ్యతలు తీసుకున్న హార్దిక్ పాండ్యా.. ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయాడు. 11 మ్యాచ్లు ఆడిన ముంబై ఇండియన్స్ కేవలం మూడు విజయాలు మాత్రమే నమోదు చేసింది. ఇప్పటికే ఈ సీజన్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న ముంబై ఇండియన్స్ పరువు కోసం పాకులాడుతోంది.
జూన్ 1 నుంచి 29 వరకు అమెరికా, వెస్టిండీస్ వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్లో టీమిండియా వైస్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు.
ముంబై వేదికగా జరిగిన మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 173 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్(30 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 48), ప్యాట్ కమిన్స్(17 బంతుల్లో 2 ఫోర్లు, 2సిక్స్లతో 35 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడగా.. ముంబై ఇండియన్స్ బౌలర్లలో హార్దిక్ పాండ్యా, పియూష్ చావ్లా మూడేసి వికెట్లు తీయగా.. బుమ్రా, అన్షుల్ కంబోజ్ తలో వికెట్ తీసారు.