ఐపీఎల్ 2025 సీజన్లో మరో బ్లాక్బాస్టర్ మ్యాచ్కు రంగం సిద్దమైంది. ఈ రోజు(గురువారం) రాత్రి 7. గంటలకు ముంబైలోని వాంఖడే మైదానం వేదికగా ప్రారంభమయ్యే మ్యాచ్లో భీకర బ్యాటింగ్ లైనప్ కలిగిన ముంబై ఇండియన్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. వరుసగా 4 పరాజయాల తర్వాత విధ్వంసకర బ్యాటింగ్తో పటిష్టమైన పంజాబ్ కింగ్స్ను మట్టికరిపించిన సన్రైజర్స్ హైదరాబాద్ పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. 246 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించిన ఆరెంజ్ ఆర్మీ మరోసారి తమ బ్యాటింగ్ లైనప్ సత్తా ఏంటో ప్రత్యర్థులకు తెలియజేసింది.
గత సీజన్ మాదిరే దూకుడుగా ఆడుతున్న కమిన్స్ సేన బ్యాటింగ్ బలాన్నే నమ్ముకుంది. మరోవైపు ముంబై ఇండియన్స్ పరిస్థితి కూడా సన్రైజర్స్ హైదరాబాద్లానే ఉంది. 6 మ్యాచ్ల్లో నాలుగింటిలో ఓడిన ముంబై.. ఢిల్లీతో జరిగిన గత మ్యాచ్లో అద్భుత ఫీల్డింగ్తో చిరస్మరణీయ విజయాన్నందుకుంది. అదే జోరును కొనసాగించి సొంతగడ్డపై సన్రైజర్స్ను ఓడించాలనే పట్టుదలతో ఉంది. జస్ప్రీత్ బుమ్రా రాకతో ముంబై బౌలింగ్ పదునెక్కింది.
అతన్ని సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఈ సీజన్లో పాత్ర ఫ్రాంచైజీలపై ఆటగాళ్లు చెలరేగుతున్న క్రమంలో ఇన్నాళ్లు ముంబైకి ఆడి.. ఈ సీజన్లో సన్రైజర్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఇషాన్ కిషన్పై అందరి దృష్టి నెలకొంది.

300 వస్తదా..?
ఇరు జట్లలో భీకర బ్యాటింగ్ లైనప్ ఉండటం.. వాంఖడే పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉండనున్న నేపథ్యంలో 300 స్కోర్ నమోదవుతుందా? అనే చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. సన్రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఫామ్ అందుకోవడం.. గత మ్యాచ్లో ఈ ఇద్దరూ విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగడంతో వై నాట్ 300 అనే అంశం మళ్లీ చర్చనీయాంశమైంది. ఈ ఇద్దరికి తోడుగా ఇషాన్ కిషన్, హెన్రీచ్ క్లాసెన్ చెలరేగితే.. ఆరెంజ్ ఆర్మీ సునాయసంగా 300 పరుగులు చేస్తుందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. అయితే ముంబై పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉన్నా.. స్పిన్నర్లకు కూడా సహకరించనుంది. ఈ పిచ్పై ఉండే బౌన్స్ స్పిన్నర్లకు అడ్వాంటేజ్గా మారనుంది. ఈ క్రమంలోనే 250 ప్లస్ స్కోర్లు సాధ్యమైనా.. 300 కష్టమని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
బలం-బలహీనత వాళ్లే..
సన్రైజర్స్ హైదరాబాద్ ప్రధాన బలం టాపార్డర్ బ్యాటర్స్. ట్రావిషేక్తో పాటు ఇషాన్ కిషన్ చెలరేగితే సన్రైజర్స్ హైదరాబాద్కు తిరుగుండదు. ఒకవేళ ఈ ముగ్గురు పవర్ ప్లేలోనే వెనుదిరిగితే మాత్రం సన్రైజర్స్ ఇన్నింగ్స్ గాడి తప్పుతోంది. సన్రైజర్స్ను ముంచినా.. తేల్చినా టాపార్డర్ బ్యాటర్లే. గత 6 మ్యాచ్లను పరిశీలిస్తేనే ఈ విషయం సుస్పష్టమవుతోంది. ఈ క్రమంలోనే సన్రైజర్స్ టాపార్డర్ రాణించాలని టీమ్మేనేజ్మెంట్తో ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
పంజాబ్పై 246 పరుగుల లక్ష్యాన్ని సన్రైజర్స్ 9 బంతులు మిగిలి ఉండగానే చేధించింది. ఈ విజయం సన్రైజర్స్ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. టాపార్డర్కు అనుగుణంగా.. మిడిలార్డర్ బ్యాటర్లు నితీష్, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మలు చెలరేగితే సన్రైజర్స్కు భారీ విజయం దక్కుతుంది. బౌలింగ్లో షమీ, కమిన్స్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాల్సి ఉంది. ఈ పిచ్లో జీషన్ అన్సారీ కీలకం కానున్నాడు.
రోహిత్ శర్మ చెలరేగెనా..?
మరోవైపు రోహిత్ శర్మ వైఫల్యం ముంబై ఇండియన్స్కు నష్టం చేస్తోంది. గత ఐదు మ్యాచ్ల్లో రోహిత్ 56 పరుగులు మాత్రమే చేశాడు. అతని వైఫల్యం కారణంగా మిడిలార్డర్ స్వేచ్చగా బ్యాటింగ్ చేయలేకపోతుంది. సూర్య, తిలక్, హార్దిక్, నమన్ ధీర్ ఫామ్లో ఉన్నాడు. విల్ జాక్స్, ర్యాన్ రికెల్టన్ చెలరేగితే ముంబై బ్యాటింగ్కు తిరుగుండదు. బుమ్రా, బౌల్ట్, దీపక్ చాహర్, సాంట్నర్, కరణ్ శర్మలతో బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉంది.
తుది జట్లు(అంచనా)
సన్రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రీచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, ప్యాట్ కమిన్స్(కెప్టెన్), హర్షల్ పటేల్, మహమ్మద్ షమీ, జీషాన్ అన్సారీ, ఇషాన్ మలింగా.
ముంబై ఇండియన్స్: హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, నమన్ ధీర్, విల్ జాక్స్, మిచెల్ సాంట్నర్, దీపక్ చహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, కర్ణ్ శర్మ.