హైదరాబాద్: ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ వికెట్పై సోషల్ మీడియా వేదికగా తీవ్ర దుమారం రేగింది. ఆదివారం ముంబైలోని వాంఖడే వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టీమ్ డేవిడ్ సంచలన బ్యాటింగ్తో ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.
అయితే రోహిత్ శర్మ వికెట్ విషయంలో సంజూ శాంసన్ తొండి చేశాడని ముంబై ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు.అంపైర్లను బండ బూతులు తిట్టారు. ఐపీఎల్ 1000వ మ్యాచ్లోనూ సరైన అంపైరింగ్ చేయకపోవడం ఏంటని నిలదీసారు. ఇంత టెక్నాలజీ అందుబాటులో ఉన్నా.. అంపైర్లు తప్పిదం చేయడం ఏంటని మండిపడ్డారు.

సందీప్ శర్మ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే రోహిత్ శర్మ(3) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ ఓవర్ చివరి బంతిని సందీప్ శర్మ స్లో నకుల్ బాల్గా వేయగా.. రోహిత్ ఓవర్ కవర్ దిశగా ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతి వేగాన్ని అంచనా వేయడంలో విఫలమైన రోహిత్ మూల్యం చెల్లించుకున్నాడు. రోహిత్ బ్యాట్ను మిస్సైన బంతి వికెట్ల స్టంప్స్ను ముద్దాడుతూ కీపర్ సంజూ శాంసన్ చేతిలో పడింది.
అయితే బంతి వికెట్లను తాకలేదని, దగ్గరగా కీపింగ్ చేస్తున్న సంజూ శాంసన్ గ్లోవ్స్ తాకి పడ్డాయని రోహిత్ ఫ్యాన్స్ ఆరోపణలు గుప్పించారు. అందుకు తగ్గట్లే ఓ క్లిష్టమైన వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో సంజూ గ్లోవ్సే వికెట్లను తాకినట్లు కనిపించింది. ఈ వీడియోను షేర్ చేస్తూ ఐపీఎల్ నిర్వహకులపై అభిమానులు విమర్శలు గుప్పించారు. దాంతో ఈ వికెట్కు సంబంధించిన క్లారిటీ వీడియోను నిర్వాహకులు ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
రోహిత్ శర్మ వికెట్ విషయంలో ఎలాంటి డ్రామా జరగలేదని, క్లియర్ ఔటని క్యాప్షన్ ఇచ్చింది. ఈ వీడియోలో సంజూ శాంసన్ గ్లోవ్స్ వికెట్లకు చాలా దూరంగా ఉండగా.. బంతి చివరి సెకనులో స్టంప్స్ను ముద్దాడుతూ అతని చేతిలో పడింది. దాంతో రోహిత్ శర్మ వికెట్ విషయంలో వచ్చిన ఆరోపణలన్నీ ఉత్తవేననే విషయం స్పష్టమైంది.