
ముంబై: రాజస్థాన్ రాయల్స్ స్టార్ బ్యాట్స్మన్ జోస్ బట్లర్(68 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్స్లతో 100) సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్ 2022 సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో ఈ ఇంగ్లీష్ బ్యాట్స్మన్ పరుగుల విధ్వంసం సృష్టించాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి ముంబై బౌలర్లపై విరుచుకుపడిన బట్లర్ 11 ఫోర్లు, 5 సిక్సర్లతో వీర విహారం చేశాడు. జస్ప్రీత్ బుమ్రా 19వ ఓవర్ తొలి బంతికి క్విక్ సింగిల్ తీసి సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఈ సీజన్లో ఇదే ఫస్ట్ సెంచరీ కాగా.. ఐపీఎల్లో బట్లర్కు ఇది రెండవ శతకం కావడం విశేషం.
ముంబై బౌలర్ బాసిల్ తంపికి బట్లర్ పట్ట పగలే చుక్కలు చూపించాడు. అతను వేసిన నాలుగో ఓవర్లో 0, 4, 6, 6, 4, 6 వరుసగా 5 బౌండరీలు బాది 26 పరుగులు పిండుకున్నాడు. ఈ ఓవర్ మూడో బంతిని 104 మీటర్ల భారీ సిక్సర్గా బాదడం విశేషం. ప్రస్తుతం ఈ సిక్స్ నెట్టింట వైరల్గా మారింది. ఐపీఎల్లో బట్లర్కు ముంబై ఇండియన్స్ కలిసొచ్చిన జట్టు. ఈ మ్యాచ్తో కలిపి ముంబైపై 5 మ్యాచ్లు ఆడిన బట్లర్.. 75 సగటుతో 300కు పైగా పరుగులు చేశాడు. అత్యధిక స్కోర్ 100 కావడం విశేషం. స్ట్రైక్రేట్ 166గా ఉంది.
సెంచరీ అనంతరం మరింత దూకుడుగా ఆడుతాడనుకున్న బట్లర్.. బుమ్రా సూపర్ బాల్కు క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దాంతో 200కు పైగా భారీ స్కోర్ చేస్తుందని భావించిన రాజస్థాన్.. 193 పరుగలకే పరిమితమైంది. బట్లర్ విధ్వంసానికి షిమ్రాన్ హెట్మైర్(14 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 35), సంజూ శాంసన్(21 బంతుల్లో ఫోర్, 3 సిక్స్లతో 30)తుఫాను ఇన్నింగ్స్లు తోడవడంతో రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 193 పరుగుల భారీ స్కోర్ చేసింది. చివరి మూడు ఓవర్లలో రాజస్థాన్.. 23 పరుగులే చేసింది. ముఖ్యంగా బుమ్రా వేసిన 19వ ఓవర్లో మూడు పరుగులే వచ్చాయి.