ఐపీఎల్ 2025 సీజన్లో ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ వైఫల్యం కొనసాగుతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)తో సోమవారం వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్లోనూ రోహిత్ శర్మ దారుణంగా విఫలమయ్యాడు. 9 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 17 పరుగులే చేసి యశ్ దయాల్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. బ్యాటింగ్కు అనుకూలంగా ఉన్న వికెట్పై భారీ షాట్లు ఆడిన రోహిత్.. టచ్లోకి వచ్చినట్లు కనిపించాడు. కానీ లెఫ్టార్మ్ పేసర్లపై తనకు ఉన్న బలహీనతను మరోసారి బయటపెట్టుకున్నాడు.
గాయంతో గత మ్యాచ్కు దూరంగా ఉన్న రోహిత్.. ఈ మ్యాచ్లోనూ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ సీజన్లో ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్లు ఆడిన రోహిత్ శర్మ 0, 8, 13, 17 పరుగులతో 38 పరుగులే చేశాడు. తాజా వైఫల్యంపై ముంబై ఇండియన్స్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రిటైర్మెంట్ ప్రకటించి కుర్రాళ్లకు అవకాశం ఇవ్వాలని హితవు పలుకుతున్నారు. రోహిత్ శర్మ తప్పుకుంటేనే ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ చేరుతుందని కామెంట్ చేస్తున్నారు.

రోహిత్ శర్మలో మునపటి సత్తా కనబడటం లేదని, అతను గౌరవంగా తప్పుకోవడమే ఉత్తమమని అభిప్రాయపడుతున్నారు. రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించడం ఉత్తమమని హితవు పలుకుతున్నారు. రోహిత్ పేలవ ఫామ్ గురించి తెలిసే ముంబై ఇండియన్స్ అతన్ని రిటైన్ చేసుకోలేదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. రూ. 18 కోట్లకు తీసుకుంటే.. కోటికి 2.25 పరుగుల చొప్పున 38 పరుగులు చేశాడని సెటైర్లు పేల్చుతున్నారు. అభిమానులే కాకుండా మాజీ క్రికెటర్లు, ఐపీఎస్ అధికారులు కూడా రోహిత్ శర్మ వైఫల్యంపై విమర్శలు గుప్పిస్తున్నారు.
రోహిత్ శర్మ స్థానంలో మరే ఆటగాడు ఉన్నా.. తుది జట్టులో చోటు కోల్పోయేవాడని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ ఇప్పటికే విమర్శలు గుప్పించాడు. హైదరాబాద్ సిటీ పోలీస్ కమీషనర్ సీవీ ఆనంద్ సైతం.. రోహిత్ శర్మ ఎందుకు ఇంకా ఆటలో కొనసాగుతున్నాడని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.