ముంబై: ఐపీఎల్ 2023 సీజన్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ వైఫల్యం కొనసాగుతోంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)తో మంగళవారం జరిగిన మ్యాచ్లోనూ రోహిత్(7) దారుణంగా విఫలమయ్యాడు. వానిందు హసరంగా వేసిన ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో రోహిత్ శర్మ ఎల్బీగా వెనుదిరిగాడు. ముందుగా అంపైర్ ఔటివ్వకపోవడంతో ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ రివ్యూతో ఫలితాన్ని రాబట్టాడు.
ఇక ఈ వికెట్ విషయంలో థర్డ్ అంపైర్ ఇచ్చిన నిర్ణయంపై దుమారం రేగుతోంది. నిబంధనల ప్రకారం రోహిత్ శర్మ ఔట్ కాదని అభిమానులు, మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పిస్తున్నారు. మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్, మునాఫ్ పటేల్ సైతం ట్విటర్ వేదికగా ఇదే విషయాన్ని ప్రస్తావించారు.

హసరంగా వేసిన 5వ ఓవర్ చివరి బంతికి స్టెప్ ఔటైన రోహిత్.. లెగ్సైడ్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతి గమనాన్ని అంచనా వేయకపోవడంతో బ్యాట్ను మిస్సైన బంతి అతని ప్యాడ్లను తాకింది. వెంటనే ఆర్సీబీ ఆటగాళ్లు అప్పీల్ చేయగా అంపైర్ ఔట్ ఇవ్వలేదు. రోహిత్ శర్మ స్టెప్ ఔట్ అవ్వడంతో పాటు బంతి వికెట్లను మిస్సవుతుందని అంతా అనుకున్నారు.
క్రికెట్లో '3 మీటర్' నిబంధన ప్రకారం వికెట్లకు బ్యాటర్ మూడు మీటర్లు అంతకంటే ఎక్కువ దూరంగా ఉంటే ఎల్బీగా పరిగణించరు. రోహిత్ శర్మ 3.7 మీటర్లు దూరంగా ఉండి ఆ బంతిని ఆడాడు. కానీ థర్డ్ అంపైర్ మాత్రం ఈ విషయాన్ని పట్టించుకోకుండా ఔటిచ్చాడు.
ఈ నిబంధన తెలిసే హసరంగా కూడా రివ్యూ కోసం పట్టుబట్టలేదు. కానీ ఫాఫ్ డుప్లెసిస్ రివ్యూ తీసుకోగా.. బాల్ ట్రాకింగ్లో బంతి వికెట్లను తాకినట్లు తేలడంతో థర్డ్ అంపైర్ ఔటిచ్చాడు. ఈ నిర్ణయంతో రోహిత్ శర్మ బిత్తరపోయాడు. ఇదేలా ఔట్ అని ఆశ్చర్యపోయాడు. అయిష్టాంగానే మైదానం వీడిన రోహిత్.. నేరుగా ముంబై డగౌట్లోకి వెళ్లి వీడియో అనలిస్ట్తో మాట్లాడాడు.

అది అలా ఎలా ఔటని ప్రశ్నించాడు. ముంబై సపోర్ట్ స్టాఫ్ సైతం ఈ వికెట్పై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. నిబంధనలకు విరుద్దంగా థర్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని ప్రకటించాడని ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు.
బోర్డర్ గావస్కర్ ట్రోఫీ నాలుగో టెస్టులో శుభ్మన్ గిల్ 3 మీటర్ల రూల్ సాయంతోనే నాథన్ లియాన్ బౌలింగ్లో ఎల్బీ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. బంతి వికెట్లను తాకే అవకాశం ఉన్నా.. బ్యాటర్ క్రీజ్ వదిలి చాలా దూరం ముందుకు రావడంతో అంపైర్ నాటౌట్గా ప్రకటించాడు.
బెంగళూరుతో మ్యాచ్లో రోహిత్ శర్మ కూడా 3 మీటర్ల కంటే ఎక్కువ దూరమే ముందుకొచ్చాడని.. అక్కడే బంతి ప్యాడ్ను తాకిందని ఫోటోలతో సహా అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. డీఆర్ఎస్లో దూరాన్ని చెక్ చేయకుండా థర్డ్ అంపైర్ ఎలా తన నిర్ణయాన్ని ప్రకటిస్తాడని ఫ్యాన్స్ మండిపడుతున్నారు.