రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్కు తాకరాని చోట బంతి బలంగా తాకింది. దాంతో నొప్పితో విలవిలలాడిన డుప్లెసిస్ క్రీజులోనే కుప్పకూలాడు. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్తో వాంఖడే వేదికగా జరుగుతున్న మ్యాచ్లో ఈ ఘటన చోటు చేసుకుంది.
ముంబై యువ పేసర్ ఆకాశ్ మధ్వాల్ వేసిన 6వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ నాలుగో బంతిని ఆకాశ్ మధ్వాల్ గుడ్ లెంగ్త్లో వేయగా.. ఫాఫ్ డుప్లెసిస్ లెగ్ సైడ్ స్వీప్ షాట్ ఆడే ప్రయత్నం చేయగా.. మిస్ టైమ్ అయిన బంతి అతని జననేంద్రియ భాగంలో బలంగా తాకింది. బంతి దెబ్బకు కుప్పకూలిన డుప్లెసిస్.. ఫిజియోల ప్రథమ చికిత్స అనంతరం కోలుకొని బ్యాటింగ్ను కొనసాగించాడు.

నొప్పితో బాధపడుతున్న ఫాఫ్ డుప్లెసిస్ను ముంబై ఇండియన్స్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ టీజ్ చేశాడు. నొప్పి ఎలా ఉంది? అంటూ ఆట పట్టించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి.
ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీకి ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. మూడో ఓవర్లోనే విరాట్ కోహ్లీ(0)ని బుమ్రా కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేర్చగా.. విల్ జాక్స్(8)ను ఆకాశ్ మధ్వాల్ ఔట్ చేశాడు. దాంతో 23 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి ఆర్సీబీ పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన రజత్ పటీదార్తో కలిసి ఫాఫ్ డుప్లెసిస్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపిస్తున్నాడు. ఈ జోడీ ఆచితూచి ఆడటంతో పవర్ ప్లేలో ఆర్సీబీ 2 వికెట్లకు 44 పరుగులే చేసింది.
అనంతరం దూకుడు పెంచిన ఈ జోడీ భారీ షాట్లతో వేగంగా పరుగులు చేసింది. ముఖ్యంగా రజత్ పటీదార్ ట్రేడ్ మార్క్ సిక్స్లతో చెలరేగాడు. దాంతో ఆర్సీబీ 10 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్లకు 89 పరుగులు చేసింది.