ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) మధ్య వాంఖడే మైదానం వేదికగా జరుగుతున్న మ్యాచ్కు అభిమానులు పోటెత్తారు. భారీ సంఖ్యలో ప్రేక్షకులు ఈ మ్యాచ్కు హాజరయ్యారు. అయితే ముంబై ఇండియన్స్ హోమ్ గ్రౌండ్ అయిన ఈ మ్యాచ్కు ఆర్సీబీ ఫ్యాన్స్ కూడా భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఆర్సీబీ ఎరుపు జెర్సీలు ధరించి మరి ఆ జట్టుకు అండగా నిలిచారు. దాంతో ముంబైలోని వాంఖడే మైదానం ఆర్సీబీ జెర్సీలతో ఎరుపెక్కింది. ఆర్సీబీ నినాదాలతో దద్దరిల్లింది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీతో చెలరేగడంతో అభిమానుల సంతోషం రెట్టింపు అయ్యింది.
ముంబై ఇండియన్స్ అభిమానులు సైతం కోహ్లీ హాఫ్ సెంచరీని ఆస్వాదించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా, విరాట్ కోహ్లీ మధ్య పోరు అభిమానులను ఆకట్టుకుంది. బుమ్రా బౌలింగ్లో కోహ్లీ భారీ షాట్లు ఆడాడు. సుదీర్ఘ విరామం తర్వాత ఈ మ్యాచ్తో రీఎంట్రీ ఇచ్చిన బుమ్రాపై కోహ్లీ ఎదురుదాడికి దిగాడు. విజ్ఞేష్ పుతుర్ బౌలింగ్లో భారీ సిక్స్ బాదిన కోహ్లీ 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 42 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 67 పరుగులు చేసిన కోహ్లీ.. హార్దిక్ పాండ్యా బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి పెవిలియన్ చేరాడు.

ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ అరుదైన ఫీట్ అందుకున్నాడు. టీ20 క్రికెట్లో 13 వేల పరుగుల మైలురాయిని ధాటాడు. ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ వేసిన మూడో ఓవర్లో చివరి రెండు బంతులను కోహ్లీ బౌండరీలు బాది 13వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఓవరాల్గా ఈ ఘనతను అందుకున్న ఐదో బ్యాటర్గా నిలిచాడు. అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన రెండో బ్యాటర్గా రికార్డ్ సాధించాడు. విరాట్ కోహ్లీ కంటే ముందు క్రిస్ గేల్ 381 ఇన్నింగ్స్ల్లో ఈ ఫీట్ సాధించగా.. విరాట్ కోహ్లీ 386వ ఇన్నింగ్స్లో ఈ రికార్డ్ అందుకున్నాడు.
టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో క్రిస్ గేల్(14562) అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. అలెక్స్ హేల్స్ (13610), షోయబ్ మాలిక్ (13557), కీరన్ పోలార్డ్(13537), విరాట్ కోహ్లీ కంటే ముందున్నారు.