ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)తో జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఛీటింగ్కు పాల్పడిందని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ముఖ్యంగా ఈ మ్యాచ్ అంపైర్లను ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ కొనేసిందని, మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడిందని సోషల్ మీడియా వేదికగా ఆరోపిస్తున్నారు.
ఈ మ్యాచ్లో ఆర్సీబీ బ్యాటింగ్ సందర్భంగా ఫీల్డ్ అంపైర్లు తీసుకున్న నిర్ణయాలు అభిమానులతో పాటు క్రికెట్ విశ్లేషకులను ఆశ్చర్యపరిచాయి. అంపైర్లు తీసుకున్న నిర్ణయాలన్నీ ముంబైకి ఫేవర్గా ఉండటంతో ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తిపోస్తున్నారు.

ముఖ్యంగా నితిన్ మీనన్ దారుణమైన తప్పులు చేశాడని అతన్ని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఆర్సీబీ ఇన్నింగ్స్లో అతను నాలుగు తప్పిదాలు చేశాడని ఆరోపిస్తున్నారు. ఆకాశ్ మధ్వాల్ ఆపిన ఓ బౌండరీని చెక్ చేయలేదని, అతని క్లియర్ బౌండరీ అని ఫొటోలతో సహా వివరిస్తున్నారు.
ఓ వైడ్ విషయంలోనూ ఇలానే తప్పిదం చేశారని, ముంబై ఇండియన్స్ రివ్యూలు అయిపోయిన తర్వాత కూడా క్యాచ్ ఔట్ విషయంలో సమీక్ష తీసుకున్నారని, లోమ్రోర్ ఎల్బీ విషయంలోనూ తప్పుడు నిర్ణయాన్ని ప్రకటించారని మండిపడుతున్నారు.
బంతి లెగ్ స్టంప్ దిశగా వెళ్తుందని తెలిసినా ఔట్ ఇచ్చి అంపైర్స్ కాల్గా అతను ఔటయ్యేలా కుట్ర చేసారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ నోబాల్ విషయంలోనూ తప్పుడు నిర్ణయాన్ని ప్రకటించారని, విరాట్ కోహ్లీ సైతం అసంతృప్తి వ్యక్తం చేశాడని కామెంట్ చేస్తున్నారు. అభిమానుల ట్రోలింగ్ ధాటికి ఎక్స్ వేదికగా నితిన్ మీనన్, అంపైర్ ఇండియన్స్ అనే హ్యాష్ ట్యాగ్స్ ట్రెండింగ్లోకి వచ్చాయి.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 196 పరుగులు చేసింది. ఫాఫ్ డుప్లెసిస్(40 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 61), రజత్ పటీదార్(26 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 50), దినేశ్ కార్తీక్(23 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్లతో 53 నాటౌట్)హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు.
ముంబై బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా(5/21) నిప్పులు చెరగగా.. గెరాల్డ్ కోయిట్జీ, ఆకాశ్ మధ్వాల్, శ్రేయస్ గోపాల్ తలో వికెట్ తీసారు.