ముంబై: ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) బ్యాటర్లు దుమ్మురేపారు. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్(41 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో 65), గ్లేన్ మ్యాక్స్వెల్(33 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్లతో 68) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగారు.
దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 199 పరుగులు చేసింది. చివర్లో దినేశ్ కార్తీక్(18 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 30) మెరుపులు మెరిపించాడు. ముంబై బౌలర్లలో జాసన్ బెహ్రెండార్ఫ్(3/36) మూడు వికెట్లు తీయగా.. కామెరూన్ గ్రీన్, క్రిస్ జోర్డాన్, కుమార్ కార్తీకేయ తలో వికెట్ తీసారు.

శుభారంభం లేదు..:
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీకి ఆదిలోనే గట్టిషాక్ తగిలింది. బెహ్రెండార్ఫ్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే విరాట్ కోహ్లీ కీపర్ క్యాచ్గా వెనుదిరిగాడు. అతని మరుసటి ఓవర్లో అనూజ్ రావత్(6) కూడా క్యాచ్ ఔటవ్వడంతో ఆర్సీబీ 16 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన గ్లేన్ మ్యాక్స్వెల్ భారీ షాట్లతో చెలరేగాడు. దాంతో పవర్ ప్లేలో ఆర్సీబీ 2 వికెట్లకు 56 పరుగులు చేసింది.
మ్యాక్సీ విధ్వంసం..:
పవర్ ప్లే అనంతరం మ్యాక్సీకి తోడుగా ఫాఫ్ డుప్లెసిస్ కూడా చెలరేగడంతో ఆర్సీబీ స్కోర్ బోర్డు పరుగెత్తింది. 25 బంతుల్లో మ్యాక్స్వెల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. 9.3 ఓవర్లలోనే ఆర్సీబీ 100 పరుగులు అందుకుంది. ఆ వెంటనే ఫాఫ్ డుప్లెసిస్ 30 బంతుల్లో హాఫ్ సెంచరీ బాది ఈ సీజన్లో 6వ అర్థశతకాన్ని ఖాతాలో వేసుకున్నాడు.
విడదీసిన బెహ్రెండార్ఫ్:
120 పరుగుల భారీ భాగస్వామ్యంతో క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీని బెహ్రెండార్ఫ్ విడదీసాడు. స్లోయర్ బాల్తో మ్యాక్సీని క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మహిపాల్ లోమ్రోర్(1) క్లీన్ బౌల్డ్ అవ్వగా.. ఫాఫ్ డుప్లెసిస్ను కామెరూన్ గ్రీన్ పెవిలియన్ చేర్చాడు. ఇంపాక్ట్ ప్లేయర్గా కేదార్ జాదవ్ బరిలోకి దిగగా.. దినేశ్ కార్తీక్ బౌండరీలతో విరుచుకుపడ్డాడు.
అతనిచ్చిన సునాయస క్యాచ్ను గ్రీన్ నేలపాలు చేశాడు. ఈ అవకాశంతో కార్తీక్ మరింత ధాటిగా ఆడాడు. చివరకు క్రిస్ జోర్డాన్ అతన్ని స్లోయర్ బాల్తో క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి వచ్చిన వానిందు హసరంగా రెండు బౌండరీలు బాదగా.. కేదార్ జాదవ్ ఆచితూచి ఆడటంతో ఆర్సీబీ 199 పరుగులు చేయగలిగింది.