ఐపీఎల్ 2025 సీజన్ ముగింపు దశకు చేరింది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ బెర్త్లు ఖరారు కాగా.. టాప్-2లో నిలిచేందుకు నాలుగు జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అదేందో కానీ ప్లే ఆఫ్స్ చేరిన నాలుగు జట్లు వరుసగా తమ లీగ్ మ్యాచ్ల్లో ఓటమిపాలయ్యాయి. ఈ క్రమంలోనే జైపూర్ వేదికగా నేడు జరగాల్సిన ముంబై ఇండియన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు పాయింట్స్ టేబుల్లో నిలిచే అవకాశం ఉంది.
ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ 13 మ్యాచ్ల్లో 8 విజయాలు, ఓ మ్యాచ్ రద్దుతో 17 పాయింట్స్తో రెండో స్థానంలో నిలవగా.. ముంబై ఇండియన్స్ 13 మ్యాచ్ల్లో 8 విజయాలు 16 పాయింట్స్తో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. పంజాబ్ కింగ్స్తో జరిగే నేటి మ్యాచ్లో ముంబై విజయం సాధిస్తే 18 పాయింట్స్తో పాటు మెరుగైన రన్రేట్లో టాప్ ప్లేస్లో నిలుస్తోంది. పంజాబ్ గెలిస్తే మాత్రం 19 పాయింట్స్తో టాప్ ప్లేస్ ఖరారు చేసుకుంటుంది. ఈ మ్యాచ్లో ఓడిన జట్టు ఎలిమినేటర్ మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది.

ఐపీఎల్ ప్లే ఆఫ్స్ ఫార్మాట్ ప్రకారం టాప్-2లో నిలిచిన జట్లు నేరుగా క్వాలిఫయర్-1 మ్యాచ్ ఆడుతాయి. ఇందులో గెలిచిన జట్టు ఫైనల్ చేరనుండగా.. ఓడిన జట్టుకు క్వాలిఫయర్-2 రూపంలో మరో అవకాశం ఉంటుంది. మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు ఎలిమినేటర్ మ్యాచ్ ఆడుతాయి. ఎలిమినేటర్లో గెలిచిన జట్టు క్వాలిఫయర్-2 ఆడుతోంది. ఇందులో గెలిచిన జట్టు ఫైనల్ చేరుతుంది. ఈ క్రమంలోనే టాప్-2లో నిలిచేందుకు జట్లు ప్రాధాన్యత ఇస్తాయి.
సీఎస్కేతో ఆదివారం జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ 83 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. ఈ పరాజయంతో ఆ జట్టు రన్రేట్ కూడా తగ్గింది. గుజరాత్ టాప్-2లో నిలవాలంటే ముంబై ఇండియన్స్, ఆర్సీబీ తమ తదుపరి మ్యాచ్ల్లో ఓడాలి. లేదంటే ఎలిమినేటర్ మ్యాచ్ ఆడక తప్పదు. ముంబై ఇండియన్స్ పటిష్టంగా ఉండగా.. పంజాబ్ కింగ్స్ను చాహల్ గాయం కలవరపెడుతోంది.