
అబుదాబి: తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ చెలరేగింది. పంజాబ్ కింగ్స్తో మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్లో సమష్టి ప్రదర్శన కనబర్చిన ముంబై 6 వికెట్లతో గెలుపొందింది. ఈ విజయంతో ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. మరోవైపు పంజాబ్ ప్లే ఆఫ్స్ ఆశలు గల్లంతయ్యాయి. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 135 పరుగులు చేసింది. ఎయిడెన్ మార్క్రమ్(42), దీపక్ హుడా(28) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ముంబై బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, కీరన్ పొలార్డ్ రెండేసి వికెట్లు తీయగా.. రాహుల్ చాహర్, కృనాల్ పాండ్యా చెరొక వికెట్ తీశారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ముంబై 19 ఓవర్లలో 4 వికెట్లకు 137 రన్స్ చేసింది. హార్దిక్ పాండ్యా(30 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 40 నాటౌట్), సౌరభ్ తివారీ(37 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 45) రాణించారు. చివర్లో కీరన్ పొలార్డ్(7 బంతుల్లో ఫోర్, సిక్స్తో 15 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. ఈ మ్యాచ్తో హార్దిక్ ఫామ్లోకి రావడం అటు ముంబై.. ఇటు టీమిండియా శుభపరిణామం.
136 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ(8), సూర్యకుమార్ యాదవ్(0)లను రవి బిష్ణోయ్ వరుస బంతుల్లో ఔట్ చేశాడు. రోహిత్ శర్మను క్యాచ్ ఔట్ చేసిన రవి.. సూర్యకుమార్ యాదవ్ను క్లీన్ బౌల్డ్ చేసి గోల్డెన్ డక్గా పెవిలియన్ చేర్చాడు. దాంతో ముంబై ఇండియన్స్ 16 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన సౌరభ్ తివారితో మరో ఓపెనర్ క్వింటన్ డికాక్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. ఈ జోడీ పూర్తిగా రక్షణాత్మక ధోరణీలో ఆడటంతో పవర్ ప్లే ముగిసేసరికి ముంబై రెండు వికెట్లు కోల్పోయి 30 పరుగులు మాత్రమే చేసింది.
ఆ తర్వాత కూడా ఆడపా దడపా బౌండరీలతో ఇన్నింగ్స్ను ముందుకు నడిపించారు. క్రీజులో పాతుకుపోతున్న ఈ జోడీని మహమ్మద్ షమీ అద్భుత బంతితో విడదీసాడు. క్వింటన్ డికాక్ను క్లీన్ బౌల్డ్ చేసి మూడో వికెట్కు నమోదైన 45 పరుగుల భాగస్వామ్యానికి తెరదించాడు. ఆ తర్వాత క్రీజులోకి హార్దిక్ పాండ్యా రాగా.. సౌరభ్ తివారీ పోరాడారు. ఇక హార్దిక్ ఇచ్చిన క్యాచ్లను పంజాబ్ ఆటగాళ్లు నేలపాలు చేశారు. దాంతో ఈ అవకాశాలను అందుకున్న హార్దిక్ క్రీజులో పాతుకుపోయాడు.
మరో ఎండ్లో సౌరభ్ తివారీ ఔటైనా.. పొలార్డ్తో కలిసి విజయ లాంఛనం పూర్తి చేశాడు. అయితే పంజాబ్ ఆటగాళ్ల తప్పిదాలు ముంబైకి కలిసొచ్చాయి. 24 బంతుల్లో 40 పరుగులు చేయాల్సిన స్థితిలో.. మహమ్మద్ షమీ వేసిన 17వ ఓవర్లో హార్దిక్ ఫోర్, సిక్స్ బాది మూమెంటమ్ను మార్చాడు. అర్షదీప్ సింగ్ వేసిన 18వ ఓవర్లో పొలార్డ్ కూడా 4, 6 బాదడంతో మ్యాచ్ పూర్తిగా ముంబైవైపు మళ్లింది. ఇక షమీ వేసిన 19వ ఓవర్లో రెండు ఫోర్లు, సిక్స్తో విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.